మేడ మీద నుంచి పడి కూతురు చనిపోయిందంటూ ఫోన్.. పోస్ట్మార్టమ్ ద్వారా అసలు విషయం తెలుసుకున్న తండ్రి.. పోలీస్ స్టేషన్కు వెళ్లి..
ABN , First Publish Date - 2022-01-04T20:16:57+05:30 IST
ఆమెకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.. భర్తతో కలిసి అత్తింట్లోనే నివసిస్తోంది.. సోమవారం సాయంత్రం ఆమె చనిపోయింది..
ఆమెకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.. భర్తతో కలిసి అత్తింట్లోనే నివసిస్తోంది.. సోమవారం సాయంత్రం ఆమె చనిపోయింది.. మేడ మీద నుంచి పడి చనిపోయిందని భర్త పోలీసులకు చెప్పాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు.. మహిళ శరీరంలో విషం ఉందని పోస్ట్మార్టమ్లో తేలింది.. ఆ విషయం తెలుసుకున్న మహిళ తండ్రి అసలు సంగతి బయటపెట్టాడు.. కట్నం కోసం తన కూతురిని అత్తింటి వారు చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన మదన్ మోహన్ శర్మ కూతురు కాజల్ 2018లో మోహిత్ శర్మను వివాహం చేసుకుంది. అల్లుడికి తన స్థోమతకు తగినట్టుగా మదన్ కట్నకానుకలు అందించారు. అయితే అదనంగా ఓ కారు కావాలని మోహిత్ అడిగాడు. అందుకు మదన్ అంగీకరించకపోవడంతో పెళ్లైన నాటి నుంచి కాజల్ను అత్తింటి వారు టార్చర్ పెట్టడం ప్రారంభించారు. ఎన్నోసార్లు కాజల్ను కొట్టి పుట్టింటికి పంపేశారు.
ఇప్పటికే పలుసార్లు రాజీ కుదిర్చి కూతుర్ని అత్తింటికి పంపామని మదన్ తాజాగా పోలీసులకు చెప్పాడు. సోమవారం మధ్యాహ్నం అత్తింటి వారు తమ కూతురి భోజనంలో విషం కలిపేసి చంపారని, అనంతరం మేడ మీద నుంచి కిందకు తోసేశారని మదన్ ఆరోపించారు. వరకట్న హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాజల్ భర్తను, అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.