రన్వే పై దుబాయికి వెళ్లే విమానం.. ప్రయాణికులను చెక్ చేస్తున్న అధికారులు.. 25 ఏళ్ల కుర్రాడి బ్యాగ్లో దుస్తుల మధ్యలో..
ABN , First Publish Date - 2022-01-22T22:11:30+05:30 IST
రన్వే పై దుబాయికి వెళ్లే విమానం ప్రయాణానికి సిద్ధంగా ఉంది. వచ్చి పోయే ప్రయాణికులతో ఎయిర్పోర్ట్ అంతా సందడిగా ఉంది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఎప్పటిలాగే తమ పని తాము చేసు

ఇంటర్నెట్ డెస్క్: రన్వే పై దుబాయికి వెళ్లే విమానం ప్రయాణానికి సిద్ధంగా ఉంది. వచ్చి పోయే ప్రయాణికులతో ఎయిర్పోర్ట్ అంతా సందడిగా ఉంది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఎప్పటిలాగే తమ పని తాము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 25ఏళ్ల కుర్రాడి బ్యాగును అధికారులు తనిఖీ చేశారు. అయితే, ఆ కుర్రాడి బ్యాగులో దుస్తుల మధ్య ఉన్న వాటిని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
శనివారం ఉదయం జైపూర్లోని ఎయిర్పోర్ట్లో దుబాయికి వెళ్లే విమానం రన్వే పై సిద్ధంగా ఉంది. ఈ ఫ్లైట్లో దుబాయికి వెళ్లేందుకు 25ఏళ్ల కుర్రాడు విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అతడి బ్యాగ్ను తనిఖీ చేశారు. అనంతరం బ్యాగులో దుస్తుల మధ్య సుమారు రూ.25.58లక్షల విలువైన యూఏఈ దిర్హమ్లు ఉండటంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తర్వాత అందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. భారీ మొత్తంలో యూఏఈ కరెన్సీతో పట్టుబడ్డ కుర్రాడిని గుజరాత్కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు చెప్పారు. అంతేకాకుండా దుబాయిలో కాస్మోటిక్స్ను కొనుగోలు చేసి, వాటిని ఇక్కడ అమ్ముతూ వ్యాపారం చేస్తున్నట్టు సదరు కుర్రాడు తమ విచారణలో చెప్పాడని అధికారులు వెల్లడించారు. అయితే ఫారెన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ప్రకారం.. 5వేల అమెరికా డాలర్ల కంటే ఎక్కువ నగదుతో ప్రయాణించడానికి అనుమతి లేదని చెప్పారు. ఈ క్రమంలోనే 25ఏళ్ల కుర్రాడి వద్ద లభించిన కరెన్సీని సీజ్ చేసినట్టు వివరించారు. అంతేకాకుండా ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.