Dubai Duty Free: లండన్ వెళ్తూ విమానాశ్రయంలో లాటరీ టికెట్ కొన్న భారతీయుడు.. అదృష్టం వరించడంతో..
ABN , First Publish Date - 2022-12-08T08:29:15+05:30 IST
అబుదాబిలో ఉండే భారత ప్రవాసుడు లండన్ వెళ్లేందుకు ఫ్యామిలీతో కలిసి దుబాయ్ విమానాశ్రయానికి వెళ్లాడు.
దుబాయ్: అబుదాబిలో ఉండే భారత ప్రవాసుడు లండన్ వెళ్లేందుకు ఫ్యామిలీతో కలిసి దుబాయ్ విమానాశ్రయానికి వెళ్లాడు. ఆ సయమంలో అక్కడ దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ (Dubai Duty Free Millennium Millionaire) లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అదే మనోడికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. బుధవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన డ్రాలో భారతీయుడు కొన్న ఆ టికెట్కే జాక్పాట్ (Jackpot) తగిలింది. దాంతో 1మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో రూ.8.23కోట్లు. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన జయ క్రిష్ణ (Jaya Krishnan) గత కొన్నేళ్లుగా యూఏఈ రాజధాని అబుదాబిలో నివాసం ఉంటున్నాడు. దీరాలోని ఇంటిగ్రల్టెక్ నెట్వర్క్స్ ఎల్ఎల్సీలో (IntegralTech Networks LLC) ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో నవంబర్ 8న లండన్ (London) వెళ్లేందుకు తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి దుబాయ్ విమానాశ్రయానికి వెళ్లాడు. ఆ సమయంలో దుబాయ్ డ్యూటీ ప్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్ సిరీస్ 407లో ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అలా ప్రయాణం చేస్తూ కొన్న ఆ లాటరీ టికెటే క్రిష్ణకు లక్ను తీసుకొచ్చింది. బుధవారం దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ & సీఈఓ కోల్మ్ మెక్లౌగ్లిన్ ఆధ్వర్యంలో దుబాయ్ ఎయిర్పోర్టులో నిర్వహించిన డ్రాలో క్రిష్ణ విజేతగా నిలిచాడు. దాంతో 1మిలియన్ డాలర్లు (రూ.8.23కోట్లు) గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా క్రిష్ణ మాట్లాడుతూ.. "చాలా సంవత్సరాలుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్లలో పాల్గొంటున్నాను. మొదటిసారి ఇంత భారీ మొత్తం గెలవడం మాటల్లో చెప్పలేని ఆనందం. దుబాయ్ డ్యూటీ ఫ్రీ చాలా మంది వ్యక్తుల జీవితాలను మారుస్తోంది. వారిలో ఒకరిగా ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞుడను" అని చెప్పాడు.