108 మంది మహిళా పృచ్ఛకులతో త్రయోదశ శతావధానం

ABN , First Publish Date - 2022-11-03T18:21:42+05:30 IST

"సప్తఖండ అవధాన సాహితీ ఝరి - త్రయోదశ శతావధానం - అష్టోత్తర శత మహిళా పృచ్ఛకురాండ్రతో సరస్వతీ సమర్చనం"  అనే అపూర్వ శతావధాన కార్యక్రమం విజయవంతమైంది..

108 మంది మహిళా పృచ్ఛకులతో త్రయోదశ శతావధానం

ఎన్నారై డెస్క్: "సప్తఖండ అవధాన సాహితీ ఝరి - త్రయోదశ శతావధానం - అష్టోత్తర శత మహిళా పృచ్ఛకురాండ్రతో సరస్వతీ సమర్చనం"  అనే అపూర్వ శతావధాన కార్యక్రమం విజయవంతమైంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సుమారు 108 మంది మహిళా శిరోమణులు ఇందులో పాల్గొన్నారు. ఏలూరు వేదికగా "సప్త ఖండ అవధాన సార్వభౌమ" బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ (శ్రీ ప్రణవ పీఠం) ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించారు.

ప్రారంభోత్సవ సభలో బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ పోల్సాని మురళీధరరావు హాజరై సభను ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ శతావధానంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ తెలుగు సంస్థలకు చెందిన 108 మంది మహిళలు పృచ్ఛకలుగా పాల్గొన్నారు. 78 సమస్యలు, 33 ఆశువులు, నలుగురి అప్రస్తుత ప్రసంగాలతో సభ జరిగింది. మూడవ రోజు ఉదయం జరిగిన ధారణ సభ నయనానందకరంగా ఒక  పండుగ వాతావరణాన్ని సృష్టించింది. అయితే.. అవధాన కళా మౌళి", బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్.. కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా, అంతర్జాలంలో తిలకిస్తున్న సాహితీ ప్రియులను ఆశ్చర్యపరిచారు. రెండు రోజుల్లో పూరణ చేసిన 78 సమస్యలను కేవలం 55 నిమిషాల్లో ఆశ్చర్యకరంగా ధారణ చేశారు. ఈ నేపథ్యంలో ‘మహాధారణ అయిన తరువాత కూడా మరొక సమస్య తీసుకుని పూరణ చేయడం అసాధారణం. అంతేకాదు ఈ అవధానంలో అన్నీ సమస్యాంశాలను తీసుకోవడం కూడా మరొక నూతన ప్రయోగం’ అని ప్రణవ పీఠం స్వచ్ఛంద కార్య నిర్వాహకురాలు కృష్ణ పద్మ (టెక్సాస్) తెలియజేశారు. అనంతరం జరిగిన విజయోత్సవ సభలో భారతదేశం పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలుగు భాషలో ప్రత్యేకమైన ప్రక్రియగా అవధానానికి ఉన్న స్థానం సుస్థిరమని అభిప్రాయపడ్డారు. మహిళా పృచ్ఛకులతో అవధాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. 

Untitled-5.jpg

ఈ కార్యక్రమంలో డాక్టర్ కోలవెన్ను మలయవాసిని, డాక్టర్ శారదా పూర్ణ సుసర్ల శొంఠి, బులుసు అపర్ణ, మా శర్మ, డాక్టర్ సుహాసిని ఆనంద్ కొమరగిరి, పాలడుగు శ్రీచరణ్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులు, తెలుగు సంఘాల ప్రతినిధులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అంతర్జాతీయ తెలుగు సంస్థలకు కృష్ణ పద్మ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర అమెరికా ఖండం - తెలుగు తల్లి కెనడా - లక్ష్మి రాయవరపు; యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా - యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ప్రణవ పీఠం నుంచి రావు తల్లాప్రగడ; ఆసియా ఖండం - మలేషియా తెలుగు సంఘం - డా. వెంకట ప్రతాప్, సత్య మల్లుల; ఆఫ్రికా ఖండం - దక్షిణ ఆఫ్రికా సాహిత్య వేదిక - రాపోలు సీతారామరాజు తదితులకు కృతజ్ఞతలు తెలిపారు. కవిగా, సంగీతవేత్తగా, పౌరాణికులుగా, ప్రవచనకర్తగా, శ్రీ ప్రణవపీఠ స్థాపకులుగా, త్రిభాషా కోవిదులుగా అవధాన ఋషి మండలంలో విశిష్ట స్థానాన్ని పొందిన వద్దిపర్తిని సభికులు కొనియాడారు. కరోనా కాలాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకొని, అందివచ్చిన ఆధునిక సాంకేతికతను అపురూపంగా, అపూర్వంగా మలచుకున్న ఘనత ఆయనకే దక్కిందని అభిప్రాయపడ్డారు. "సప్తఖండ అవధాన సాహితీ ఝరి" ఎన్నో ప్రపంచ రికార్డులను సొంతం చేసుకోవడమే దీనికి నిదర్శనం అన్నారు.

Untitled-6.jpg

‘తాజగా జరిగిన శతావధానం అపూర్వమైనది.  ప్రపంచంలోని సప్త ఖండాల నుంచి అందరూ మహిళా పృచ్ఛకులు కలిసి ఇంత పెద్ద స్థాయిలో 'శతావధానం' నిర్వహించడం ఘనతరమైన సారస్వత సాహసం. ఇది ముందెన్నడూ జరగని అపురూప దృశ్యం. ‘పద్యం మన సంపద. అవధానం మన సంతకం’ అనే నినాదంతో ముందుకెళ్తున్న ప్రతీ కవీ ధన్యులే. ఈ క్రమంలోనే బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ పరమ ధన్యులు, సరస్వతీ స్వరూపులు’ అని స్వచ్ఛంద కార్య నిర్వాహకురాలు కృష్ణ పద్మ అన్నారు. సప్తఖండాల నుండి వివిధ దేశాల సాహిత్య నిపుణులు పాల్గొన్న ఈ సాహిత్య కార్యక్రమం అంగరంగా వైభవంగా జరిగింది. ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని. నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న నానుడితో సభ జయప్రదంగా ముగిసింది.

Updated Date - 2022-11-03T18:24:15+05:30 IST