Air Travellers: చెక్ ఇన్ కష్టాలకు చెక్.. ఇక ఫోన్లు, ల్యాప్టాప్లు బయటకు తీయక్కర్లేదు!
ABN , First Publish Date - 2022-12-22T08:20:19+05:30 IST
ఎయిర్పోర్టుల వద్ద సెక్యూరిటీ తనిఖీ సమయంలో బ్యాగుల్లో ఉన్న ఫోన్లు, ల్యాప్టాప్లు, చార్జర్లు బయటకు తీసి ప్రత్యేక ట్రేలలో వేసి గంటల తరబడి క్యూలైన్లో నిలబడే తలనొప్పులకు త్వరలోనే తెరపడనున్నాయి.
ఎయిర్పోర్టుల్లో కొత్త రకం బ్యాగేజీ స్కానర్లు
న్యూఢిల్లీ, డిసెంబరు 21: ఎయిర్పోర్టుల వద్ద సెక్యూరిటీ తనిఖీ సమయంలో బ్యాగుల్లో ఉన్న ఫోన్లు, ల్యాప్టాప్లు, చార్జర్లు బయటకు తీసి ప్రత్యేక ట్రేలలో వేసి గంటల తరబడి క్యూలైన్లో నిలబడే తలనొప్పులకు త్వరలోనే తెరపడనున్నాయి. ఎయిర్పోర్టుల్లో రద్దీని తగ్గించే చర్యల్లో భాగంగా బ్యాగుల్లో ఎలకా్ట్రనిక్ వస్తువలను బయటకు తీయకుండానే స్కాన్ చేసే కొత్త రకం మిషన్లను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఎయిర్పోర్టుల్లో భద్రతను పర్యవేక్షించే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) విభాగానికి త్వరలోనే ఈ కొత్త బ్యాగేజీ స్కానర్లను అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త స్కానింగ్ యంత్రాలను ముందుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఒక ఏడాదిలోగా మిగిలిన అన్ని ఎయిర్పోర్టుల్లోనూ అమర్చుతారు. ఇలాంటి కొత్త బ్యాగేజీ స్కానర్లు ఇప్పటికే అమెరికా, ఐరోపాలోని అనేక ఎయిర్పోర్టుల్లో వాడుకలో ఉన్నాయి. ఎలక్ర్టానిక్ వస్తువులను బ్యాగుల్లో నుంచి బయటకు తీసే పనిలేకపోవడంతో చెక్ ఇన్ వద్ద రద్దీ తగ్గుతుంది.