International Yoga Day : ఢిల్లీలో ఉచితంగా యోగా : సీఎం Arvind Kejriwal
ABN , First Publish Date - 2022-06-21T17:22:20+05:30 IST
అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో

న్యూఢిల్లీ : అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో యోగా డే కార్యక్రమాలు జరుగుతున్నాయి. భారత్లో ఉదయం నుంచి పలువురు ప్రముఖులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఉదయం జరిగిన ఓ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో ఉచితంగా యోగా సాధన చేయవచ్చునని, అందుకు అవకాశం ఉందని ప్రకటించారు. గతేడాది కొవిడ్ థర్డ్వేవ్ సమయంలో ప్రవేశపెట్టిన ‘యోగ్శాల(Yogshala)’ కార్యక్రమం వివరాలను మరోసారి వెల్లడించారు.
కొవిడ్ రోగుల కోసం గతేడాది ప్రవేశపెట్టిన ‘యోగ్శాల’ కార్యక్రమం వివరాలను వెల్లడించారు. కొంతమంది జనాలు ఉమ్మడిగా ఒకేచోట యోగా చేస్తామంటే ఒక టీచర్ను పంపించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం సజావుగా కొనసాగుతోందన్నారు. మొత్తం 546 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఇందుకోసం యోగా టీచర్లతో కమిటీని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
ప్రతిరోజూ అరగంటకుపైగా యోగా సాధన చేస్తే ఒత్తిడి తగ్గిపోతుంది. అంతేకాదు రోగాలు ముప్పు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో గత రెండేళ్లు ఎంతో సంక్లిష్టంగా గడిచాయని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా థర్డ్ వేవ్ ఢిల్లీ నగరాన్ని ఇబ్బంది పెట్టింది. ఈ సమయంలో కొవిడ్ రోగులు కోలుకోవడంలో యోగా ఎంతోగానో దోహదపడిందని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో యోగా టీచర్లు గొప్ప కృషి చేశారని కొనియాడారు. ఆన్లైన్లో యోగా పాఠాలు చెప్పి 4700 రోగులు కోలుకోవడంలో సాయం చేశారని గుర్తుచేశారు. ఇదే విషయంలో పేషెంట్లను అడడగా.. ఎంతో లబ్ది పొందామని వారు చెప్పారని కేజ్రీవాల్ చెప్పారు. తమపై వైరస్ తీవ్రత తగ్గడంలో యోగా అక్కరకొచ్చిందన్నారు.