సముద్రపు లోతుల్లో నౌక శిథిలాలు.. ప్రపంచ రికార్డు బద్దలు!
ABN , First Publish Date - 2022-07-19T22:58:11+05:30 IST
గత నెలలో అన్వేషకులు సముద్రపు లోతుల్లో శిథిలనౌక (Shipwreck)ను గుర్తించి ప్రపంచ రికార్డును బద్దలుగొట్టారు
న్యూఢిల్లీ: గత నెలలో అన్వేషకులు సముద్రపు లోతుల్లో శిథిలనౌక (Shipwreck)ను గుర్తించి ప్రపంచ రికార్డును బద్దలుగొట్టారు. అమెరికన్ నేవీకి చెందిన జాన్ సి బట్లర్-క్లాస్ డిస్ట్రాయర్ యూఎస్ఎస్ శామ్యూల్ బి రాబర్ట్స్ (USS Samuel B Roberts) నౌక రెండో ప్రపంచ యుద్ధ సమయలో మునిగిపోయింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ద్వీపదేశమైన ఫిలిప్పీన్స్లోని సమర్ సమీపంలోని సముద్రంలో దీనిని గుర్తించారు. సముద్ర ఉపరితలానికి 6865 మీటర్ల (21,521 అడుగులు) లోతున అన్వేషకులు ఈ నౌకను కనుగొన్నారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత లోతున గుర్తించిన శిథిల నౌకగా ఇది గిన్నిస్ రికార్డుకెక్కింది.
అక్టోబరు 1944లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ (World War II) సమయంలో నౌకాదళం యుద్ధం భీకరంగా జరిగింది. దీనిని ‘లేటె గల్ఫ్’ (Battle of Leyte Gulf) అని పిలుస్తారు. ఈ పసిఫిక్ వార్లో యూఎస్ డిస్ట్రాయర్ కూడా పాల్గొంది. తర్వాత ఫిలిప్పీన్స్పై దాడి చేసిన యూఎస్ నేవీ.. జపాన్ నావికాదళాన్ని ఓడించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR) ప్రకారం.. మునిగిపోయిన యూఎస్ డిస్ట్రాయర్ సముద్ర మట్టానికి దిగువన దక్షిణ అమెరికా, అకాన్కాగువాలోని ఎత్తైన పర్వతమంత లోతులో ఉంది. నిలువులో చెప్పాలంటే ఎనిమిది బుర్జ్ ఖలీఫాలంత. బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యం. లేదంటే 20 ఈఫిల్టవర్ల ఎత్తుతో సమానమైన లోతులో ఈ నౌకను గుర్తించారు. అట్లాంటిక్ మహాసముద్రంలో 3,800 మీటర్ల (12,470 అడుగులు) లోతులో ఉన్న ఆర్ఎంఎస్ టైటానిక్(RMS Titanic) కంటే దాదాపు రెండింతల లోతులో యూఎస్ నేవీ నౌక శిథిలాలను గుర్తించారు.