తలపాగా ధరించినంత మాత్రానికి సర్దార్ అయిపోరు : ప్రియాంక గాంధీ
ABN , First Publish Date - 2022-02-16T01:22:23+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్
చండీగఢ్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్లపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా విరుచుకుపడ్డారు. వీరిద్దరూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నుంచి వచ్చినవారేనన్నారు. పంజాబ్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం రూప్నగర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
బీజేపీ, ఆప్ నేతలు ప్రజల ముందుకు వస్తున్నారని, వారిద్దరూ ఒకే విధమైన ఆట ఆడుతున్నారని చెప్పారు. వాళ్ళిద్దరూ ఒకేలా ఉంటారన్నారు. నరేంద్ర మోదీని, అరవింద్ కేజ్రీవాల్ని చూడండన్నారు. వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచి తమ జీవితాలను ప్రారంభించారని ప్రశ్నించారు. వాళ్ళిద్దరూ ఆరెస్సెస్ నుంచి వచ్చినవారేనని చెప్పారు. పంజాబ్ పంజాబీలదేనని ఈ రెండు పార్టీలకు చెప్పాలన్నారు.
తలపాగా ధరించినంత మాత్రానికి సర్దార్ అయిపోరన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం జలంధర్లో జరిగిన బీజేపీ ప్రచార సభలో తలపాగా ధరించి పాల్గొన్న సంగతి తెలిసిందే.
వేదికపై తలపాగా ధరించినంత మాత్రానికి సర్దార్ అయిపోరని వాళ్ళిద్దరికీ చెప్పండని ప్రియాంక అన్నారు. నిజమైన సర్దార్ ఎవరో వారికి చెప్పాలన్నారు. ఈ తలపాగాలో శ్రమించే తత్వం, ధైర్యసాహసాలు ఉన్నాయని చెప్పమని పిలుపునిచ్చారు. పంజాబ్ పంజాబీలదేనని, వారే దానిని నడుపుకుంటారని చెప్పాలన్నారు.