Vande Bharat: ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వందే భారత్
ABN , First Publish Date - 2022-11-12T11:27:14+05:30 IST
దక్షిణాదికి మంజూరైన తొలి వందేభారత్(Vande Bharat) హైస్పీడ్ రైలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మైసూరు - బెంగళూరు - చెన్నై మధ్య అత్యంత వేగంగా
బెంగళూరు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): దక్షిణాదికి మంజూరైన తొలి వందేభారత్(Vande Bharat) హైస్పీడ్ రైలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మైసూరు - బెంగళూరు - చెన్నై మధ్య అత్యంత వేగంగా ప్రయాణించే ఈ రైలును చూసేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. తొలిరోజు ఈ రైలు బెంగళూరు - చెన్నై మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఆగింది. బుల్లెట్ రైలు తరహాలో ఉన్న ఈ రైలును కొందరు తాకి సంతోషపడ్డారు. మరికొందరు రైలులోకి ఎక్కి దిగారు. ఈ మార్గంలో వందేభారత్ రైలు సంచారం ద్వారా ప్రయాణ సమయాన్ని రెండు గంటలపాటు తగ్గించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యాటక రంగానికి ఈ రైలు దోహదపడుతుందని భావిస్తున్నారు. బుధవారం మినహా వారంలో ఆరు రోజులు నడిచే ఈ రైలుకు మైసూరు, బెంగళూరు, కాట్పాడి, చెన్నైలో మాత్రమే స్టాప్లు ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా ఈ రైలు ఆగిన అన్ని స్టేషన్లలోనూ ప్రధాని నరేంద్రమోదీకి జై అంటూ ప్రజలు నినాదాలు చేయడం విశేషం.