ఉక్రెయిన్ నుంచి ఉడుమలైపేటకు...
ABN , First Publish Date - 2022-03-11T14:37:49+05:30 IST
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి అక్కడి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న తమిళ విద్యార్థులందరి పరిస్థితి దయనీయంగా మారిందని, అన్నపానీయాలు లేకుండా అలమటించామని, మెట్రో
- దాగిన చోటే బాంబుల వర్షం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతోనే బయటపడ్డాం: అశ్వంత్
చెన్నై: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి అక్కడి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న తమిళ విద్యార్థులందరి పరిస్థితి దయనీయంగా మారిందని, అన్నపానీయాలు లేకుండా అలమటించామని, మెట్రో సొరంగమార్గంలో, బంకర్లలో దాగినా ఆ ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిసిందని ఉడుమలైపేట విద్యార్థి అశ్వంత్ తెలిపారు. తిరుప్పూరు జిల్లా ఉడుమలైపేటకు చెందిన అశ్వంత్ ఉక్రెయిన్ కార్గివ్నగర్లోని వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ ఐదో సంవత్సరం చదువుతున్నారు. ఇటీవలే భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానం ద్వారా ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ సహాకారంతో విమానంలో కోయంబత్తూరుకు, అక్కడి నుంచి స్వస్థలానికి చేరుకున్న అశ్వంత్కు తల్లి దండ్రులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అశ్వంత్ మీడియాతో మాట్లాడుతూ కార్గివ్నగర్లో ఓ అపార్ట్మెంట్ను అద్దెకు తీసు కుని స్నేహితులో కలిసి ఉన్నానని, చెప్పారు. రష్యా యుద్ధం చేయనుందనే విషయం తెలియగానే స్వదేశానికి తిరిగివచ్చేందుకు తామంతా ప్రయత్నిం చామని, అయితే విమాన టికెట్లు లభించలేదన్నారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తమిళ విద్యార్థులందరూ తలో దిక్కుకు వెళ్ళి బంకర్లలో, మెట్రోరైలు సొరంగమార్గాల్లో తలదాచుకున్నారని, అదే సమయంలో ఆ ప్రాంతాలకు దగ్గర్లో రష్యా వైమానిక దళాలు బాంబుల వర్షం కురిపించాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి 28 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో తమిళ విద్యార్థులంతా కాలినడకన సుమారు ముప్పై కిలోమీటర్ల దూరం వరకూ నడిచి సరిహద్దులకు చేరుకోగా, భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసి వాహనాల్లో రుమేనియాకు వెళ్ళామని, అక్కడి నుంచి విమానాల్లో అందరూ స్వదేశానికి తిరిగివచ్చామని అశ్వంత్ వివరించారు. ఉక్రెయిన్లో బయల్దేరినప్పటి నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాట్లతోనే స్వగ్రామాలకు చేరుకున్నామని తెలిపారు. సకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని అశ్వంత్ చెప్పారు.