ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఇక తిరుగులేదు
ABN , First Publish Date - 2022-07-28T07:52:52+05:30 IST
రాజకీయ కక్షసాధింపుల కోసం మోదీ సర్కారు చేతిలో పదునైన అస్త్రంగా మారుతోందని ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో..
మనీలాండరింగ్ చట్టం రాజ్యాంగబద్ధమే.. ఈడీకి అరెస్టు అధికారం ఉంది
నిందితులకు ప్రతిసారి ఈసీఐఆర్ ఇవ్వక్కర్లేదు
ఈ చట్టంలోని సెక్షన్లలో ఉల్లంఘనలు లేవు
545 పేజీల తీర్పులో స్పష్టం చేసిన సుప్రీం
పీఎంఎల్ఏపై 200కుపైగా పిటిషన్లు
ఆర్థిక వ్యవస్థ పాలిట పెనుముప్పు
మనీలాండరింగ్ అని వ్యాఖ్య
ద్రవ్యవినిమయ బిల్లుపై
అభ్యంతరాలు విస్తృత ధర్మాసనానికి..
జస్టిస్ ఖాన్విల్కర్ ధర్మాసనం స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రాజకీయ కక్షసాధింపుల కోసం మోదీ సర్కారు చేతిలో పదునైన అస్త్రంగా మారుతోందని ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో.. మనీలాండరింగ్ చట్టంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఈ చట్టానికి సంబంధించి అనేక కఠిన నిబంధనలతోపాటు ఈడీ అధికారులకు కల్పిస్తున్న పలు విశేష అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన 200కు పైగా పిటిషన్లలోని వాదనలను, విమర్శలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. చట్టంలో పొందుపర్చిన నిబంధనలు రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన ఽధర్మాసనం విస్పష్టంగా పేర్కొంది. మనీలాండరింగ్ అనేది తీవ్రమైన నేరమనీ.. ఆర్థిక వ్యవస్థ పాలిట అది పెనుముప్పు అని స్పష్టంచేసింది. అందుకే.. పీఎంఎల్ఏ చట్టంలోని ఉన్న కఠిన ప్రొవిజన్లన్నీ సమర్థనీయమైనవేనని తేల్చిచెప్పింది. ఈ చట్టంలో ఎక్కడా ఏకపక్ష వైఖరి లేదని వ్యాఖ్యానించింది. ఈ చట్టం కింద ఈడీకి దఖలు పడుతున్న అరెస్టుచేసే అధికారాలతో సహా కేసుల దర్యాప్తు, విచారణ, ఆస్తుల స్వాధీనం వంటి చర్యలన్నీ రాజ్యాంగబద్ధమైనవేనని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఇచ్చిన 545 పేజీల తీర్పును బీజేపీ చరిత్రాత్మకమని కొనియాడగా..
కాంగ్రెస్ మాత్రం ప్రజాస్వామ్యాన్ని చిక్కులో పడేసే అంశమని విమర్శించింది. ‘రాజకీయ కక్ష సాధింపు’లకు ఈ చట్టాన్ని ప్రయోగించే ప్రమాదం సుప్రీం తీర్పుతో మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)-2002ను.. ఆ చట్టంలోని పలు ప్రొవిజన్లు, సెక్షన్లను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు, పార్టీ సీనియర్నేత రాహుల్గాంధీ, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన కుమారు డు కార్తీ చిదంబరం, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ తదితరులున్నారు. ఈడీ అధికారులు పీఎంఎల్ఏ కింద చర్య లు తీసుకునేప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ)ని పాటించాలని పిటిషనర్లు ధర్మాసనాన్ని కోరారు. ‘‘పీఎంఎల్ఏ కింద ఈడీకి ఉన్న అరెస్టు అధికారాలు, బెయిల్ మంజూరు, ఆస్తుల స్వాధీనం సీఆర్పీసీకి వెలుపలే ఉన్నాయి. అయితే, ఈడీ అధికారులు పూర్తిగా పోలీసుల్లాగే వ్యవహరిస్తున్నందున దర్యాప్తు సమయంలో సీఆర్పీసీని పాటించాలి. దర్యా ప్తు సమయంలో నిందితులు సమర్పించే వాంగ్మూలాలను వారికి బెయిల్ను వ్యతిరేకించడానికి సాక్ష్యాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది రాజ్యాంగంలోని 22వ అధికరణకు విరుద్ధం. ఇది నిందితుడి రాజ్యాంగబద్ధమైన హక్కులను హరించడమే. దర్యాప్తును ప్రారంభించడం, నిందితుడు లేదా సాక్ష్యులను విచారించడానికి సమన్లు పంపడం, వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం, ఆస్తుల స్వాధీనం కోసం ఈడీ అనుసరిస్తున్న విధానాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. 20(3), 21వ అధికరణలు కల్పించే హక్కులను హరిస్తున్నాయి’’ అని వివరించారు.
పీఎంఎల్ఏ కేసుల్లో గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష ఉన్నప్పటికీ మిగతా కేసుల్లా బెయిల్ పొందడం అంత సులభంగా లేదని వివరించారు.(ఏడేళ్లలోపు శిక్షపడే నేరాల విషయంలో స్టేషన్ బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయి). బెయి ల్ నిబంధనలు, షరతులు కఠినంగా ఉన్నాయన్నారు.