Delhi: HIT-2 కథలో కూడా ఇన్ని ట్విస్ట్‌లు ఉండవేమో.. ఢిల్లీలో తల్లీకొడుకు కలిసి..

ABN , First Publish Date - 2022-11-28T14:56:57+05:30 IST

ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ఉదంతం వెలుగుచూసి నెల కూడా గడవక ముందే తాజాగా అదే తరహాలో దేశ రాజధాని ఢిల్లీలోనే మరో దారుణం వెలుగుచూసింది. కొడుకు సాయంతో కట్టుకున్న భర్తను కిరాతకంగా హతమార్చిన..

Delhi: HIT-2 కథలో కూడా ఇన్ని ట్విస్ట్‌లు ఉండవేమో.. ఢిల్లీలో తల్లీకొడుకు కలిసి..

న్యూఢిల్లీ: ఢిల్లీలో (Delhi) శ్రద్ధా వాకర్ (Shraddha Walkar) ఉదంతం వెలుగుచూసి నెల కూడా గడవక ముందే తాజాగా అదే తరహాలో దేశ రాజధాని ఢిల్లీలోనే మరో దారుణం వెలుగుచూసింది. కొడుకు సాయంతో కట్టుకున్న భర్తను కిరాతకంగా హతమార్చిన భార్యను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తను 10 ముక్కలుగా నరికిన ఆమె ఆ ముక్కలను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసింది. ఆ తర్వాత బాడీ పార్ట్స్‌ను తీసుకెళ్లి ఈస్ట్ ఢిల్లీలోని ప్రాంతంలో తల్లీకొడుకు కలిసి పారేశారు. జూన్‌లోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తేల్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. హత్య జరిగిన తీరు, ఆపై నేరాన్ని మసిపూసి మారేడుకాయ చేసేందుకు నేరస్తులు పడిన పాట్లు తెలిస్తే HIT-2 కథలో కూడా ఇన్ని ట్విస్ట్‌లు ఉండవేమో అనిపిస్తుంది. ఈ కేసులో పోలీసుల విచారణ సాగిందిలా..

* జూన్ 5న పాండవ్ నగర్‌లోని ఒక ప్రాంతంలో దుర్వాసన వస్తోందని పెట్రోలింగ్ టీం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఆ దుర్వాసన వస్తున్న వైపుగా వెళ్లి వెతకగా.. పొదల్లోని ఒక బ్యాగ్‌లో మనిషి దేహపు ముక్కలు కనిపించాయి.

* బ్యాగ్‌లో కుళ్లిపోయిన స్థితిలో మనిషి బాడీ పార్ట్స్‌ను పోలీసులు గుర్తించారు. అయితే.. ఆ బాడీ పార్ట్స్ కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ కేసులో విచారణ మొదలైంది. సమీప పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఎవరైనా కనిపించడం లేదనే ఫిర్యాదులు అందాయేమోనని దర్యాప్తు బృందం ఆరా తీయగా అలాంటి ఫిర్యాదులేవీ అందలేదని సమాధానం వచ్చింది. దీంతో.. ఈ కేసు అంత తొందరగా తేలేద కాదని పోలీసులకు అర్థమైంది. యూపీతో పాటు సమీప పొరుగు రాష్ట్రాల్లో కూడా రికార్డులను పరిశీలించారు. ప్రయోజనం లేకుండా పోయింది.

* మొత్తానికి అంజన్ దాస్ అనే వ్యక్తి కనిపించడం లేదని పోలీసులు విచారణలో గుర్తించారు. త్రిలోక్‌పురి ప్రాంతంలో భార్య పూనం, దీపక్‌తో కలిసి అంజన్ దాస్ కలిసి ఉండేవాడని తేల్చారు. అయితే.. అంజన్ దాస్ కనిపించకపోయినా భార్య, కొడుకు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులకు అనుమానమొచ్చింది.

* అంజన్ దాస్ కనిపించకుండా పోవడం, గుర్తు తెలియని మృతదేహపు ముక్కలు బ్యాగ్‌లో లభించడంపై పూనమ్, దీపక్‌ను పోలీసులు విచారించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఈ మర్డర్ మిస్టరీ గుట్టును పూనమ్ బయటపెట్టింది. అంజన్‌ను తామే చంపేసినట్లు ఒప్పుకుంది. అంత కిరాతకంగా చంపడానికి కారణం కూడా పోలీసులకు చెప్పింది. తన కొడుకు దీపక్ భార్యపై అంజన్ దాస్ కన్నేశాడని, అంతేకాకుండా విడాకులు తీసుకుని తమతో పాటే ఉంటున్న కూతురిని కూడా లైంగిక వాంఛతో చూసేవాడని పూనమ్ చెప్పింది.

* ఈ కేసులో పూనమ్ బయటపెట్టిన మరో ట్విస్ట్ ఏంటంటే.. పూనమ్‌కు అంజన్ దాస్‌ మొదటి భర్త కాదు. ఆమెకు చాలా తక్కువ వయసులోనే బీహార్‌లో సుఖ్‌దేవ్ తివారీ అనే వ్యక్తితో వివాహమైంది. పెళ్లైన కొన్నాళ్లకు సుఖ్‌దేవ్ బతుకుదెరువు కోసం ఒక్కడే ఢిల్లీకి వెళ్లాడు. నెలలు గడుస్తున్నా సుఖ్‌దేవ్ రాకపోవడంతో అతనిని వెతుక్కుంటూ పూనమ్ ఢిల్లీకి వెళ్లింది. సుఖ్‌దేవ్ కనిపించలేదు. ఆ సమయంలోనే ఢిల్లీలో కల్లూ అనే వ్యక్తితో పూనమ్ సహజీవనం చేసింది. కల్లూ పూనమ్‌ను హింసించేవాడు. కొన్నాళ్లకు అనారోగ్యం కారణంగా మంచాన పడి కల్లూ చనిపోయాడు.

* ఆ తర్వాత ఒంటరిగా ఉంటున్న పూనమ్ లిఫ్ట్ ఆపరేటర్ అయిన అంజన్ దాస్‌తో సహ జీవనం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇలా పూనమ్, అంజన్ దాస్ జీవనం సాగించారు. అయితే.. తన కొడుకు భార్యపై అంజన్ దాస్ కన్నేశాడని గుర్తించిన పూనమ్ విషయాన్ని దీపక్‌కు చెప్పింది. ఇద్దరూ కలిసి అంజన్ హత్యకు కుట్ర పన్నారు. ఈ కుట్రలో భాగంగా.. మే 30న అంజన్‌తో పూనమ్, దీపక్ ఆల్కహాల్ తాగించారు. అందులో ముందుగానే అంజన్‌కు తెలియకుండా నిద్రమాత్రలు కలిపారు. అంజన్ స్పృహ కోల్పోయాక ఇద్దరూ కలిసి అంజన్‌ను దారుణంగా గొంతులో, ఇతర శరీర భాగాల్లో పొడిచిపొడిచి చంపారు.

* ఆ రాత్రంతా అంజన్ శవాన్ని ఇంట్లోనే ఉంచారు. మరుసటి రోజు రక్తపు మరకలైన ఇంటిని శుభ్రం చేశారు. ఆ తర్వాత.. అంజన్ మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికారు. నరికాక ఆ బాడీ పార్ట్స్‌ను ఫ్రిడ్జ్‌లో ఉంచారు. ఆ తర్వాత ప్రతిరోజు రాత్రి ఒక బ్యాగ్‌లో కొన్నికొన్ని బాడీ పార్ట్స్‌ను ప్యాక్ చేసుకుని పాండవ్ నగర్ వెళ్లి ఆ సమీప ప్రాంతాల్లో పడేసి వచ్చేవారు. తల్లీకొడుకు ఇద్దరూ వెళ్లేవారు. ఇలా 8 నుంచి 10 రోజుల్లో ఫ్రిజ్‌లో ఉన్న బాడీ పార్ట్స్‌ను పడేయడం పూర్తయింది.

* అంజన్ స్వస్థలం బీహార్‌గా పోలీసులు గుర్తించారు. అతని మృతదేహానికి డీఎన్ఏ టెస్ట్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఫ్రిడ్జ్‌లో బాడీ పార్ట్స్ పడేయడటం పూర్తయ్యాక ఇంటి లోపల పెయింట్ వేయడం గమనార్హం. అంజన్ తలను ఒక గుంతలో పడేశారు. ఇలా.. బాడీ పార్ట్స్ పడేయటానికి ఈ తల్లీకొడుకు వెళ్లిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఆ సీసీ ఫుటేజ్‌లను బయటపెట్టారు. పూనమ్‌ను, దీపక్‌ను అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-11-28T15:15:22+05:30 IST