పస్తులతో గడుపుతున్నాం... తాగేందుకు నీళ్ళు లేవు!
ABN , First Publish Date - 2022-02-28T16:29:09+05:30 IST
గత నాలుగు రోజులుగా బిస్కెట్లు తింటూ పస్తులతో గడుపుతున్నామని ఉక్రెయిన్లోని తెన్కాశి జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు మొరపెట్టుకుంటూ
ఉక్రెయిన్లో తెన్కాశి విద్యార్థులు
చెన్నై: గత నాలుగు రోజులుగా బిస్కెట్లు తింటూ పస్తులతో గడుపుతున్నామని ఉక్రెయిన్లోని తెన్కాశి జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు మొరపెట్టుకుంటూ బోరున విలపించారు. ఈ మేరకు వీడియో కాల్స్ చేసి తమను వీలైనంత త్వరగా స్వస్థలానికి చేర్చేందుకు ప్రయత్నించమంటూ వేడుకున్నారు. తెన్కాశి జిల్లాకు చెందిన అబ్దుల్ రహ్మాన్, అబ్దుల్ అజీమ్, జియాత్, కన్షుల్లాహ్, సల్వాఅబ్రీన్, మహమ్మద్ నదీమ్ అనే విద్యార్థులు ఉక్రెయిన్లోని కార్గివ్ నేషనల్ మెడికల్ కాలేజీలో చదువుతున్నారు. శనివారం రాత్రి వీరు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాముంటున్న ప్రాంతం వద్దే రష్యా సైనికులు బాంబుల వర్షం కురిపిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం తమకు వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్వస్థలానికి తరలించేందుకు ప్రయత్నించమంటూ తల్లిదండ్రులకు తెలిపారు.