ఆ కళాశాలల్లో కనీస వసతులున్నాయా?
ABN , First Publish Date - 2022-07-21T14:41:33+05:30 IST
రాష్ట్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో కనీస వసతులు, విద్యార్థుల సంఖ్యకు సరిపడేంత బోధనా సిబ్బంది వున్నారో లేదో తేల్చాలని ప్రత్యేక కమిటీని
- బోధనా సిబ్బంది వున్నారా?
- పరిశీలించి నివేదిక ఇవ్వండి
- ప్రత్యేక కమిటీకి మద్రాస్ వర్సిటీ ఆదేశం
ప్యారీస్(చెన్నై), జూలై 20: రాష్ట్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో కనీస వసతులు, విద్యార్థుల సంఖ్యకు సరిపడేంత బోధనా సిబ్బంది వున్నారో లేదో తేల్చాలని ప్రత్యేక కమిటీని మద్రాస్ విశ్వవిద్యాలయం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా తమకు అనుబంధంగా వున్న 130 ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. గత ఐదేళ్లుగా ఈ కళాశాలల్లో యూనివర్సిటీ అధికారులు ఎలాంటి తనిఖీలు, పరిశీలన చేయలేదు. అయితే ఆయా కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండడంతో ఎట్టకేలకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు స్పందించారు. సదుపాయాల పరిశీలనా కమిటీ తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆగస్టు మొదటివారంలోగా అన్ని కళాశాలలను పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఇదిలా వుండగా ఈ కమిటీ అందజేసే నివేదిక ఆధారంగా కనీస వసతులు లేని కళాశాలలపై చర్యలు తీసుకోనున్నట్లు మద్రాస్ విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు.