భారతీయ జనతా పార్టీలో ప్రక్షాళన
ABN , First Publish Date - 2022-03-06T13:30:04+05:30 IST
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర బీజేపీలో ప్రక్షాళన ప్రారంభమైంది. సరిగ్గా పని చేయని నేతలను, కమిటీలను రద్దు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై
- ఎనిమిది జిల్లా కమిటీలు, విభాగాలు రద్దు
పెరంబూర్(చెన్నై): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర బీజేపీలో ప్రక్షాళన ప్రారంభమైంది. సరిగ్గా పని చేయని నేతలను, కమిటీలను రద్దు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై నిర్ణయించారు. ఆ మేరకు ఆయన రాజధాని నగరం చెన్నై సహా ఎనిమిది జిల్లా కమిటీలు, విభాగాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గత నెల 19వ తేది జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీచేసిన బీజేపీ, 22 కార్పొరేటర్లు, 56 కౌన్సిలరు, 230 పట్టణ పంచాయతీ కౌన్సిలర్లు కలిపి మొత్తం 308 స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో, పార్టీ ప్రక్షాళన చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. తిరునల్వేలి, నాగపట్టణం, చెన్నై వెస్ట్, నార్త్ చెన్నై వెస్ట్, కోయంబత్తూర్ నగర జిల్లా, పుదుకోట, ఈరోడ్ నార్త్, తిరువణ్ణామలై నార్త్ తదితర జిల్లాల అధ్యక్షులు, నిర్వాహకులు, కమిటీలు, విభాగాలు, మండల కమిటీలన్నిటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త నిర్వాహకుల ఎంపిక జరిగే వరకు తాత్కాలికంగా జిల్లా ఇన్చార్జ్లను నియమించామని, కార్యకర్తలు వారితో పనిచేయాలని అన్నామలై విజ్ఞప్తి చేశారు. ఆ ప్రకారం, తిరునల్వేలి జిల్లాకు కట్టలై ఎస్.జ్యోతి, నాగపట్టణం-టి.వరదరాజన్, చెన్నై వెస్ట్-టీఎన్ బాలాజీ, నార్త్ చెన్నై వెస్ట్-మనోహరన్, కోయంబత్తూర్ నగర్-ఏపీ మురుగానందం, పుదుకోట-సెల్వం అన్బళగన్, ఈరోడ్ నార్త్-ఎస్ఎం సెంథిల్కుమార్, తిరువణ్ణామలై నార్త్-సి.ఏళుమలైలు ఇన్చార్జ్లుగా వ్యవహరించనున్నట్లు అన్నామలై ప్రకటించారు.