Supreme Courtలో శ్రీమతి తండ్రి పిటిషన్ తోసివేత
ABN , First Publish Date - 2022-07-22T15:24:24+05:30 IST
కళ్లకుర్చి విద్యార్థిని శ్రీమతి ఆత్మహత్య కేసులో మృతురాలి తండ్రికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన కుమార్తె ఆత్మహత్య కేసులో సందేహం ఉందని,
- హైకోర్టును ఆశ్రయించాలని సూచన
అడయార్(చెన్నై), జూలై 21: కళ్లకుర్చి విద్యార్థిని శ్రీమతి ఆత్మహత్య కేసులో మృతురాలి తండ్రికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన కుమార్తె ఆత్మహత్య కేసులో సందేహం ఉందని, అందువల్ల రీపోస్టుమార్టానికి ఆదేశించి, రీపోస్టుమార్టం జరిపే సమయంలో తమ తరపు వైద్యుడు ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 13వ తేదీన కళ్లకుర్చి జిల్లా చిన్నసేలంలోని విద్యార్థిని శ్రీమతి ఆత్మహత్య చేసుకోవడంతో అనేక మంది విద్యార్థులు, స్థానికులు ఆందోళనకు దిగారు. ఇది తీవ్రరూపం దాల్చి పాఠశాల విధ్వంసానికి దారితీసింది. ఈ నేపథ్యంలో తన కుమార్తె మృతిపై సందేహం ఉందని, దానిపై న్యాయ విచారణ జరపాలని కోరుతూ విద్యార్థిని తండ్రి రామలింగం హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణలో ఉంది.ఆ తర్వాత విద్యార్థిని తండ్రి రామలింగం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలిసారి జరిపిన పోస్టుమార్టంలో తమకు సందేహం ఉందని, అందువల్ల రీపోస్టుమార్టం జరిపేలా, ఆ సమయంలో తమ తరపు డాక్టర్ ఉండేలా ఆదేశించాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ సారథ్యంలోని ధర్మాసనం విచారణ జరిపి... రీపోస్టుమార్టం అంశాన్ని హైకోర్టు పర్యవేక్షిస్తోందని, హైకోర్టుపై మీకు నమ్మకం లేదా అని ప్రశ్నించింది. అంతేకాకుండా, ఈ పిటిషన్ను అత్యవసరంగా భావించి విచారణ చేపట్టామని, రీపోస్టుమార్టంపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. ఇదే పిటిషన్పై గురువారం కూడా మరోమారు విచారణకు వచ్చింది. పిటిషనర్, ప్రభుత్వ తరపు వాదనలు ఆలకించిన ధర్మాసనం పిటిషనర్ తరపు కోరికను నిరాకరించి, పిటిషన్ను తోసిపుచ్చింది. పైగా హైకోర్టునే ఆశ్రయించాలని సూచింది. దీంతో విద్యార్థిని తండ్రి రామలింగం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంత్యక్రియలు పూర్తి చేసేందుకు సమ్మతించారు.