Ban On Firecrackers : ఢిల్లీలో బాణసంచాపై నిషేధం... అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరణ...

ABN , First Publish Date - 2022-10-20T21:14:54+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలో దీపావళి పర్వదినం సందర్భంగా

Ban On Firecrackers : ఢిల్లీలో బాణసంచాపై నిషేధం... అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరణ...

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో దీపావళి పర్వదినం సందర్భంగా బాణసంచా కాల్చడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. గంపగుత్తగా విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ప్రజలు పరిశుభ్రమైన గాలి పీల్చుకోవాలని, తమ సొమ్మును స్వీట్లపై ఖర్చు పెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. 


అంతకుముందు ఢిల్లీ హైకోర్టు కూడా ఇటువంటి పిటిషన్‌ను తిరస్కరించింది. అన్ని రకాల బాణసంచా తయారీ, అమ్మకాలు, వినియోగంపై ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) గంపగుత్తగా నిషేధం విధించడాన్ని ఈ పిటిషన్ సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నందువల్ల ఈ పిటిషన్‌పై విచారణ జరపబోమని హైకోర్టు తెలిపింది. 


డీపీసీసీ  అన్ని రకాల బాణసంచా తయారీ, అమ్మకాలు, వినియోగంపై సెప్టెంబరు 14న చిట్టచివరి క్షణంలో గంపగుత్తగా నిషేధం విధించిందని పిటిషనర్లు ఆరోపించారు. ఈ నిషేధం నియంతృత్వంతో కూడినదని, చట్టవిరుద్ధమని, తమ జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. 


ఢిల్లీ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఇటీవల విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, బాణసంచా తయారీ, నిల్వ, కొనుగోళ్ళు,  అమ్మకాలు, వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించినట్లు తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే ప్రజలపై కేసులు నమోదు చేస్తామని, ఆరు నెలల జైలు శిక్ష, రూ.200 జరిమానాతో శిక్షిస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులకు మూడేళ్ళ జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తామని చెప్పారు. 


Updated Date - 2022-10-20T21:14:54+05:30 IST