విద్యార్థులకు షూ భాగ్య బంద్
ABN , First Publish Date - 2022-07-06T17:14:45+05:30 IST
కొవిడ్ అనంతరం విద్యాశాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఉచిత సైకిల్ పథకాన్ని నిలిపివేసిన ఆ శాఖ తాజాగా విద్యార్థులకు

- తల్లిదండ్రుల్లో అసంతృప్తి
బెంగళూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ అనంతరం విద్యాశాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఉచిత సైకిల్ పథకాన్ని నిలిపివేసిన ఆ శాఖ తాజాగా విద్యార్థులకు అందిస్తూ వచ్చిన షూ భాగ్య పథకానికి కూడా బ్రేక్ వేసింది. ఈ రెండు పరిణామాలపై తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు విద్యావ్యవస్థ అతలాకుతలంగా మారి ఇప్పుడే గాడిన పడుతున్న తరుణంలో ఒక్కొక్కటిగా సౌకర్యాలను కట్ చేయడం సరికాదని వాపోతున్నారు. ప్రైవేట్ పాఠశాలలవైపు వెళుతున్న విద్యార్థులను ఆకర్షించే దిశలో 1 నుంచి 10వ తరగతులలో చేరేవారికి ప్రతివిద్యార్థికి ప్రభుత్వం ఒక జత షూ, రెండు జతల సాక్స్ పథకాన్ని 2016లో ప్రవేశపెట్టింది. 2019-20 బడ్జెట్లోనూ ఈ పథకానికి నిధులు కేటాయించారు. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు మాత్రం నిధులు విడుదల చేయలేదు. దీంతో పథకాన్ని నిలిపివేసినట్టు అధికారులు అంటున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ రెండు పథకాల రద్దుతో విద్యార్థులను నిస్తేజ పరిచేలా ఉందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.