ట్రెక్కింగ్కి వెళ్లి లోయలో పడిన విద్యార్థి
ABN , First Publish Date - 2022-02-22T19:57:34+05:30 IST
బెంగళూరు శివారు ప్రాంతం చిక్కబళ్లాపురకు అనుబంధంగా ఉండే బ్రహ్మగిరి కొండపైకి ట్రెక్కింగ్కు వెళ్లి లోయలో పడిన విద్యార్థిని ఎన్డీఆర్ఎఫ్ సహకారంతో ఎయిర్ఫోర్స్ సైనికులు హెలికాప్టర్ ద్వారా రక్షించారు.
- ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా రక్షణ
బెంగళూరు: బెంగళూరు శివారు ప్రాంతం చిక్కబళ్లాపురకు అనుబంధంగా ఉండే బ్రహ్మగిరి కొండపైకి ట్రెక్కింగ్కు వెళ్లి లోయలో పడిన విద్యార్థిని ఎన్డీఆర్ఎఫ్ సహకారంతో ఎయిర్ఫోర్స్ సైనికులు హెలికాప్టర్ ద్వారా రక్షించారు. నందికొండలకు అనుబంధంగా ఉండే బ్రహ్మగిరి కొండలకు వారాంతంలో పర్యాటకులు, ట్రెక్కింగ్ చేసే వారు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఇలా ఆదివారం ఉదయం బ్రహ్మగిరి కొండలలో ట్రెక్కింగ్ చేసేందుకు పీఈఎస్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఢిల్లీకి చెందిన నిశాంత్గుల్లా వెళ్లారు. ఓ బండపై చిక్కుకుని సుమారు 250 అడుగుల లోయలో పడ్డాడు. అక్కడి నుంచి మరో 300 అడుగుల కందకం ఉండగా ముందుకెళ్లే పరిస్థితి లేక పోయింది. వెంటనే అ ప్రమత్తమైన విద్యార్థి మొబైల్ ద్వారా ఢిల్లీలోని కుటుంబీకులకు సమాచారమిచ్చాడు. వారు జిల్లా అధికారికి ఫోన్ చేసి కుమారుడిని రక్షించాలని కోరారు. వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చిక్కబళ్లాపుర పోలీసులు, అగ్నిమాపక, అటవీశాఖాధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు రంగంలోకి దిగి విద్యార్థిని గుర్తించారు. తాళ్లద్వారా విద్యార్థిని గట్టుకు చేర్చే ప్రయత్నం చేశారు. ఈలోగానే ఎయిర్ఫోర్స్ విభాగానికి సమాచారం ఇచ్చారు. వారు హెలికాప్టర్ ద్వారా విద్యార్థిని బయటకు తీసుకు వచ్చి ఆసుపత్రికి తరలించారు. మొబైల్ఫోన్ ఉండడంతోనే వెంటనే సమాచారం ఇచ్చేందుకు వీలుకలిగింది.