ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాం
ABN , First Publish Date - 2022-05-23T15:10:50+05:30 IST
ఊటీ పర్వతాలను, అక్కడి గిరిజనులను కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఏ కష్టమొచ్చినా తనకు వెంటనే ఫిర్యాదు చేయవచ్చని స్టాలిన్ స్పష్టంచేశారు. నీలగిరి జిల్లాలోని
- ఊటీ గిరిజనులతో స్టాలిన్ భేటిఫ ఆటపాటలతో సందడి
చెన్నై, మే 22 (ఆంధ్రజ్యోతి) : ఊటీ పర్వతాలను, అక్కడి గిరిజనులను కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఏ కష్టమొచ్చినా తనకు వెంటనే ఫిర్యాదు చేయవచ్చని స్టాలిన్ స్పష్టంచేశారు. నీలగిరి జిల్లాలోని సుప్రసిద్ధ పర్యాటక నగరం ఊటీలో రెండు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి స్టాలిన్ అక్కడి గిరిజన తాండాల్లో పర్యటించారు. ఊటీలో ఫ్లవర్షో ప్రారంభించేందుకు ఆ నగరపు ద్విశత వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు సతీమణితో కలిసి స్టాలిన్ ఈ నెల 19 సాయంత్రం ఊటీ చేరుకున్నారు. రెండు రోజులపాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం ఊటీలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి కారులో బయలుదేరి అక్కడి గిరిజన తాండాలకు చేరుకున్నారు. ముందుగా ఊటీ - గూడలూరు రహదారిలోని పగల్కోడుమన్దు అనే తండాకు వెళ్ళారు. అక్కడి తోడర్ కులానికి చెందిన గిరిజనులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. గిరిజన సంఘ పెద్దలు తోడర్ కులస్థులు ధరించే ‘పూత్తుకుల్వి’ అనే సాంప్రదాయి వస్త్రాన్ని ఆయనకు వేశారు. ఆ తర్వాత తోడర్ వాద్యపరికరాలతో ఆయనకు గిరిజనులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తోడర్ కులదేవతాలయాన్ని సీఎం సందర్శించారు. ఆ సందర్భంగా తోడర్ గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులతో పాడుతూ నృత్యం చేశారు. వారి కోరిక మేరకు స్టాలిన్ వారితో కలిసి నృత్యం చేశారు. అనంతరం గిరిజనుల నివాసాలను సందర్శించిన సీఎం వినతి పత్రాలను స్వీకరించారు. వారికి ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావచ్చని, స్థానిక ఎంపీ రాజా కూడా ఎల్లవేళలా వారికి
అందుబాటులో ఉంటారని తెలిపారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి కాలినడకన వెళ్లి గిరిజన పాఠశాలలను తనిఖీ చేశారు. ఆ సందర్భంగా సెలవు రోజైనా కొంతమంది బాలికలు అక్కడ ఉండటాన్ని స్టాలిన్ గమనించి వెళ్ళి పలకరించారు. పాఠశాలలో సదుపాయాలున్నాయా అని వారిని అడగగా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని బాలికలు సమాధనమిచ్చారు. స్టాలిన్ వెంట అటవీ శాఖ మంత్రి కే రామచంద్రన్, నీలగిరి లోక్సభ సభ్యుడు ఎ.రాజా, జిల్లా కలెక్టర్ అమ్రీత్ తదితర అఽధికారులున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ ముఖ్యమంత్రి ప్రభుత్వ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుని రాత్రి చెన్నై నగరానికి చేరుకున్నారు.