Speaker: 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ABN , First Publish Date - 2022-10-08T13:04:37+05:30 IST
రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 17 ఉదయం పది గంటలకు ప్రారంభమవుతాయని స్పీకర్ అప్పావు(Speaker Appau) ప్రకటించారు.
- స్పీకర్ అప్పావు
చెన్నై, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 17 ఉదయం పది గంటలకు ప్రారంభమవుతాయని స్పీకర్ అప్పావు(Speaker Appau) ప్రకటించారు. సచివాలయంలో ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక అనుబంధ బడ్జెట్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. అన్ని పార్టీల శాసనసభ్యులు మాట్లాడేందుకు తగిన అవకాశమిస్తామని, అయితే మాట్లాడదలచిన అంశాలను లిఖిత పూర్వకంగా ముందుగానే తనకు అందజేయాలని తెలిపారు. అన్నాడీఎంకే వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తామని, ప్రతిపక్షనేత ఎడప్పాడికి, ఒ పన్నీర్సెల్వంకు అసెంబ్లీలో సీట్ల కేటాయింపు నిబంధనల ప్రకారమే ఉంటుందన్నారు. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని, సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న విషయమై సభా వ్యవవహారాల మండలి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
రెండు నివేదికల దాఖలు
ఈ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరిపిన జస్టిస్ ఆర్ముగస్వామి కమిటీ నివేదికను, తూత్తుకుడి కాల్పులపై జరిపిన జస్టిస్ అరుణా జగదీశన్ విచారణ కమిటీ నివేదికను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ప్రవేశ పెట్టనున్నారు. ముఖ్యంగా జయలలిత మృతి కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకురాలు శశికళను విచారించే విషయంపై ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఇదే విధంగా రమ్మీ నిషేధ చట్టాన్ని కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది.