Rajya sabha Elections: పరిశీలకులను నియమించిన Sonia Gandhi
ABN , First Publish Date - 2022-06-06T02:12:13+05:30 IST
రాజ్యసభ ఎన్నికలు ఈనెల 10న జరుగనుండటంతో ఆయా రాష్ట్రాలకు పార్టీ ఎన్నికల పరిశీలకులను కాంగ్రెస్..
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలు ఈనెల 10న జరుగనుండటంతో ఆయా రాష్ట్రాలకు పార్టీ ఎన్నికల పరిశీలకులను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియమించారు. మహారాష్ట్రకు మల్లికార్జున ఖర్గే, హర్యానాకు భూపేష్ బఘెల్, రాజీవ్ శుక్లా, రాజస్థాన్కు పవన్ కుమార్ బన్సాల్, టీఎస్ సింగ్ దేవ్ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రలో తమ అభ్యర్థులు గెలిపించుకోవాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. కర్ణాటకలో నాలుగు సీట్లకు ఎన్నికలు జరుగనుండగా కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేష్ బరిలో ఉన్నారు. మరో అభ్యర్థిగా మన్సూర్ అలీ ఖాన్ను కూడా కాంగ్రెస్ బరిలోకి దింపింది.
హర్యానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ పోటీలో ఉండగా, అక్కడ రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఒక్కో సీటు గెలుచుకునే అవకాశం ఉండగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీడియా దిగ్గజం కార్తికేయ శర్మకు బీజేపీ మద్దతుగా నిలుస్తోంది. రాజస్థాన్లో నాలుగు సీట్లు ఉండగా, కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టింది. రణ్దీప్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ కాంగ్రెస్ అభ్యర్థులుగా ఉన్నారు. రెండు సీట్లు కాంగ్రెస్ కచ్చితంగా గెలుచుకుంటుంది. మూడో సీటులో ప్రమోద్ తివారీ గెలుపునకు మరో 15 ఓట్లు అవసరమవుతాయి.