Aam Aadmi Party Meeting : కేజ్రీవాల్కు షాక్ ఇచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు!
ABN , First Publish Date - 2022-08-25T16:46:42+05:30 IST
ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party -AAP) కీలక సమావేశం
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party -AAP) కీలక సమావేశం గురువారం జరగనున్న సమయంలో ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరుపుతోందని ఆరోపణలు వచ్చిన తరుణంలో ఈ పరిణామాలు జరుగుతున్నాయి.
బీజేపీలో చేరితే తమకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నేతలు తమకు ఆఫర్ ఇచ్చారని నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యేల సమావేశం గురువారం జరగబోతోంది.
ఆప్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం కొందరు ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి అందుబాటులో లేరు. ఇదిలావుండగా, ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) బుధవారం సమావేశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ఖండిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. కోట్లాది రూపాయలు ఆశ చూపించి, తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
ఢిల్లీ రాష్ట్ర మద్యం విధానంలో అక్రమాలు జరిగినట్లు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మరో 14 మందిపై కేసు నమోదు చేసింది.