Singer Sidhu హత్య తమ పనేనన్న గ్యాంగ్స్టర్
ABN , First Publish Date - 2022-05-30T19:22:27+05:30 IST
సిద్ధూ ఆదివారం మాన్సా జిల్లాలోని తన స్వగ్రామం మూసేవాలాకు థార్ జీపులో ప్రైవేటు అంగరక్షకుడు(బౌన్సర్), మరో వ్యక్తితో కలిసి బయలుదేరారు. జీపును సిద్ధూ నడుపుతుండగా.. జవహార్కే గ్రామం వద్ద రెండు స్కార్పియోలు, ఒక బులేరోలో దాదాపు పది మంది దుండగులు వీరి కారును వెంబడించారు..
న్యూఢిల్లీ: పంజాబీ సింగర్ సిద్ధూ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయి హస్తముందని నిన్నటి నుంచి వస్తున్న అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ గోల్డీ బ్రార్ అనే గ్యాంగ్స్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇందుకు మరింత బలాన్ని ఇస్తోంది. అతడి ఫేస్బుక్లో షేర్ చేసిన పోస్ట్ ప్రకారం.. సిద్ధూ హత్యపై పూర్తి బాధ్యత తనతో పాటు సచిన్ బిష్ణోయ్ ధత్తరన్వాలి, లారెన్స్ బిష్ణోయ్ గ్రూపులదని చెప్పుకొచ్చాడు. కాగా యూత్ కాంగ్రెస్ నేత విక్కీ మిద్దుఖేరా, అకాలీదళ్ నేత గుర్లాల్ బ్రార్ హత్య సమయంలో కూడా తన పేరు బయటికి వచ్చిందని అయితే పోటీసులు తనను ఏమీ చేయలేదంటూ గోల్డీ వ్యాఖ్యానించాడు.
ఫేస్బుక్ ద్వారా వచ్చిన ఈ సమాచారం ఎంత వరకు వాస్తవమనేది నిర్ధారణ కావాల్సి ఉంది. నిజంగానే గోల్డీనే ఈ పోస్ట్ చేశాడా, ఇంకెవరైనా ఇలా తప్పుదారి పట్టిస్తున్నారా అనే విషయంపై విచారణ చేయాల్సి ఉందని అంటున్నారు. అయితే గోల్డీ ఇంతకు పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్లాల్ సింగ్ పెహల్వాన్ హత్యకు సంబంధించి నెల రోజుల క్రితమే ఫరీద్పూర్ కోర్టు గోల్డీకి నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
కాగా, సిద్ధూ హత్యపై పంజాబ్ పోలీసులు విచారణను వేగవంతం చేశారని డీజీపీ వీకే భావ్రా తెలిపారు. సిద్ధూ హత్యపై ఆయనతో పాటు ఇతర పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడుతూ ‘‘సిద్ధూ ఆదివారం మాన్సా జిల్లాలోని తన స్వగ్రామం మూసేవాలాకు థార్ జీపులో ప్రైవేటు అంగరక్షకుడు(బౌన్సర్), మరో వ్యక్తితో కలిసి బయలుదేరారు. జీపును సిద్ధూ నడుపుతుండగా.. జవహార్కే గ్రామం వద్ద రెండు స్కార్పియోలు, ఒక బులేరోలో దాదాపు పది మంది దుండగులు వీరి కారును వెంబడించారు. ఓ కారు వీరిని ఓవర్టేక్ చేసి.. ముందుకు వెళ్లి నిలిచింది. దాంతో మూసేవాలా తన వాహనాన్ని నిలిపారు. మూడు ఎస్యూవీల్లోంచి పిస్టళ్లు, ఏకే-47తో దిగిన దుండగులు.. విచక్షణారహితంగా కాల్పులకు దిగారు’’ అని పేర్కొన్నారు.