ఉద్ధవ్, షిండే ఏకకాలంలో పోటాపోటీ సమావేశాలు
ABN , First Publish Date - 2022-06-25T16:08:17+05:30 IST
మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంటోంది. ఇటు పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమాశానికి..
ముంబై: మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంటోంది. ఇటు పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమాశానికి శివసేన సుప్రీం, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) పిలుపునివ్వగా, అటు శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే (Eknath Shinde) సైతం తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. శనివారంనాడు పోటాపోటీ సమావేశాలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కనుంది. ముంబైలోని శివసేన భవన్లో శివసేన నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం మధ్యాహ్నం ఒంటి గంటకు జరగనుంది. వర్చువల్ మీట్ ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు.
మరోవైపు, ఏక్నాథ్ షిండే సైతం అసోంలోని గౌహతి హోటల్లో రెబల్ ఎమ్మెల్యేలతో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. తమ వర్గం నేతలు అనుసరించాల్సిన తదుపరి వ్యూహంపై ఈ సమావేశంలో షిండే చర్చించనున్నారు. మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు ఒక గ్రూప్ను కూడా ఆయన సిద్ధం చేసినట్టు చెబుతున్నారు.
రెబల్ ఎమ్మెల్యే భవిష్యత్పై నిర్ణయం...
కాగా, శివసేన రెబల్ ఎమ్మెల్యేల విషయంలో జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే అకాశం ఉంది. సభ్యత్వం రద్దుపై 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ నరహరి జైర్వాల్ నోటీసులు జారీ చేసే అbకాశం ఉంది. ఈ సస్పెన్షన్పై సవాలు చేసేందుకు షిండే సైతం లీగల్ బృందాన్ని సిద్ధం చేసుకుందని సమాచారం. ఇలాంటి పరిస్థితి ఏదైనా తలెత్తితే తెరవెనుక నుంచి షిండే వర్గానికి బీజీపీ మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. రెబల్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ డ్రామా మరికొంత కాలం కొనసాగే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.