ఉద్యోగం మారదామా..!

ABN , First Publish Date - 2022-01-20T21:08:21+05:30 IST

వృత్తి నిపుణుల్లో అధిక భఆగం(దాదాపు 82 శాతం మంది)... ఈ ఏడాది(2022) ఉద్యోగం మారాలని భావిస్తున్నారు.

ఉద్యోగం మారదామా..!

హైదరాబాద్/బెంగళూరు/ముంబై/న్యూఢిల్లీ : వృత్తి నిపుణుల్లో అధిక భాగం(దాదాపు 82 శాతం మంది)... ఈ ఏడాది(2022) ఉద్యోగం మారాలని భావిస్తున్నారు. ఈ మేరకు లింక్డిన్ తాజా సర్వేలో వెల్లడైంది. కరోనా సంక్షోభం... ఉద్యోగులను తమ కెరీర్ పై పునరాలోచనలో పడేయడంతో పాటు తమ నూతన లక్ష్యాలు, ప్రాధాన్యతలకు తగిన కొత్త ఉద్యోగాలు వెతుక్కునే దిశగా దృష్టి సారించేలా చేసిందని, మరోవైపు... కొత్త అవకాశాలపై కూడా  ధీమా పెరగడంతో ఉద్యోగుల వలసలు ఊపందుకున్నాయని, మంచి నైపుణ్యాలు కలిగినవారు మరింత సౌకర్యవంతమైన ఉద్యోగాల అణ్వేషణలో ఉన్నారని లింక్డిన్ న్యూస్ భారత విభాగం మేనేజింగ్ ఎడిటర్ అంకిత్ వెంగుర్లేకర్ పేర్కొన్నారు.


మారదాం... 82 శాతం మంది యోచన... 

ఆన్‌లైన్ ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సెట్, లింక్డిన్ తన తాజా పరిశోధనలో భారత వర్క్ ఫోర్స్ తమ భవిష్యత్తుపై ఆశాజనకంగా ఉన్నట్లు వెల్లడైనట్లు తెలిపింది. ఇందులో భాగంగా 82 శాతం మంది ఉద్యోగాలు మారాలని నిర్ణయించుకున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. దాదాపు 86 శాతం మంది నిపుణులు తమ వృత్తిపరమైన నెట్‌వర్క్ బలం గురించి పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కొత్త ఏడాదిలో ఉద్యోగావకాశాల కోసం వెతుకుతున్నారు. ఈ(2022) ఏడాది... ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయని, కెరీర్ బాగుంటుందని పూర్తి నమ్మకంతో ఉన్నారు. కరోనా నేపధ్యంలో దేశంలో నిరుద్యోగ రేటు డిసెంబరు నెలలో 8 శాతంగా నమోదైంది. గత రెండు(2020, 2021) సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంది. దేశంలోని ఆరు ప్రధాన నగరాలు సహా మరికొన్ని పట్టణాల్లో ఈ సర్వేును నిర్వహించారు. ఇక, ఉద్యోగం మారేందుకు ఆసక్తి చూపేవారిలో ఏడాది ఉద్యోగ అనుభవం కలిగిన వారు 94 శాతం మంది కాగా, జెన్ జెడ్ ప్రొఫెషనల్స్ 87 శాతం మంది ఈ ఏడాదిలో ఉద్యోగం మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. లింక్డిన్ డేటా ప్రకారం 2021 ఏప్రిల్ నెలలో మూడింట రెండొంతుల మంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టడమో, లేదా... విడిచిపెట్టినపక్షంలో, కొత్త అవకాశాలపై దృష్టి కేంద్రీకరించడమో చేస్తున్నారు. దేశంలోని 1,111 మంది  వృత్తి నిపుణుల నుండి సేకరించిన అభిప్రాయాలను లింక్డిన్ తాజా నివేదిక వెల్లడించింది. 


మార్పు అందుకే... పని-వ్యక్తిగత జీవిత సమతుల్యత లోపించిందని, అందుకే ప్రస్తుత ఉద్యోగం నుండి మారాలని భావిస్తున్నట్లు 38 శాతం మహిళలు, 28 శాతం పురుషులు పేర్కొన్నారు. ఈ కారణంగా ఉద్యోగం మారే అవకాశం ఉన్న వారిలో మహిళలే 1.3 రెట్లు అధికం. మెరుగైన వేతనం లభిస్తే ప్రస్తుత కొలువులో కొనసాగుతామని 49 శాతం మంది  ఉద్యోగినులు స్పష్టం చేయగా, పురుషుల్లో ఈ వాటా 39 శాతంగా ఉంది.


జాబ్ మార్కెట్ పై కరోనా గణనీయమైన ప్రభావం చూపిందని, ఉద్యోగులు కొత్త ప్రాధాన్యాలను నిర్దేశించుకోక తప్పని పరిస్థితిని కల్పించిందని మరో జాబ్ పోర్టల్ ఇండీడ్ సర్వే నివేదిక వెల్లడించింది. ఇక... 71 శాతం మంది ఉద్యోగులు కేరీర్ విషయంలో పునరాలోచిస్తున్నారు. మొత్తంమీద... ఉద్యోగాలు మారే వారి సంఖ్య ఈ సంవత్సరంలో ఆయా రంగాలపై తనదైన ప్రభావాన్ని చూపనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2022-01-20T21:08:21+05:30 IST