Security Lapse: షా పర్యటనలో భద్రతా లోపం.. వైసీపీ ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి అరెస్ట్
ABN , First Publish Date - 2022-09-08T17:53:26+05:30 IST
ముంబై: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముంబై పర్యటనలో భద్రతా లోపం ఏర్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ముంబై: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముంబై పర్యటనలో భద్రతా లోపం ఏర్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోంశాఖ అధికారిని అంటూ హేమంత్ పవార్ అనే వ్యక్తి హోంశాఖ ఐడీకార్డుతో గంటల తరబడి షాకు అతి సమీపంలో తిరిగాడు. అంతేకాదు తాను బందోబస్తు చూసేందుకు వచ్చానని నమ్మబలికాడు. షా పాల్గొన్న రెండు కార్యక్రమాలకూ హేమంత్ పవార్ వచ్చాడు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసాల వద్ద కూడా కనిపించాడు. హోం మంత్రిత్వ శాఖ జాబితాలో హేమంత్ పవార్ పేరు లేదని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి ఐదురోజుల పోలీస్ కస్టడీ విధించింది.
హేమంత్ పవార్ లక్ష్యమేంటి? అతడి వెనుక ఎవరెవరున్నారు అనే అంశాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. అరెస్టైన వ్యక్తి వైసీపీ ఎంపీ అనూరాధకు వ్యక్తిగత కార్యదర్శిగా భావిస్తున్నారు. పోలీసుల విచారణ తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.