ఫలితాలు నేడే

ABN , First Publish Date - 2022-03-10T06:43:56+05:30 IST

దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న

ఫలితాలు నేడే

  • ఐదు రాష్ట్రాల ఎన్నికల భవితవ్యం తేలేది ఈరోజే
  • ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం
  • ఈవీఎం సంబంధిత ఫిర్యాదులపై స్పందించిన ఎన్నికల సంఘం
  • యూపీలో ఎన్నికల విధుల నుంచి ముగ్గురు అధికారుల తొలగింపు 
  • వారాణసీ, మీరట్‌లలో పర్యవేక్షకులుగా బిహార్‌, ఢిల్లీ సీఈవోల నియామకం


న్యూఢిల్లీ/వారాణసీ, మార్చి 9 : దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. జాతీయ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల భవితవ్యం నేడు తేలనుంది. ఐదు రాష్ట్రాల్లోని దాదాపు 1,200 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.


అత్యధికంగా 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోనే 750కిపైగా కౌంటింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఈ రాష్ట్రాల్లో 50,000 మందికిపైగా అధికారులను, 671 మంది కౌంటింగ్‌ పరిశీలకులు, 130 మంది పోలీసు పరిశీలకులు, 10 మంది స్పెషల్‌ పరిశీలకులను నియమించారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ.. కరోనా లక్షణాలు కలిగిన వారినెవరినీ కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించరు. తొలుత బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రారంభమయ్యాక కొన్ని గంటల్లోనే ఫలితాలపై ప్రాథమిక అంచనాలు వెలువడతాయి. గురువారం సాయం త్రం లేదా రాత్రికల్లా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మొత్తం వచ్చేస్తాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్యకాలంలో ఏడు విడతల్లో జరిగాయి.


 ఓట్ల లెక్కింపు జరగడానికి ఒకరోజు ముందు (బుధవారం).. ఉత్తరప్రదేశ్‌లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముగ్గురు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల కమిషన్‌ (ఈసీ) నిర్ణయం తీసుకుంది. ఈవీఎంల తరలింపు ప్రక్రియపై అభ్యంతరం తెలుపుతూ సమాజ్‌వాదీ పార్టీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టింది. ఆ ముగ్గురి స్థానంలో కొత్త అధికారులను నియమించింది. ఈవీఎంల తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో వారాణసీ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ (ఈవీఎంలు)గా ఉన్న జిల్లా అదనపు మెజిస్ట్రేట్‌ (ఏడీఎం) నళినీకాంత్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఈవీఎంల తరలింపులో నళినీకాంత్‌ ప్రొటోకాల్‌ను పాటించలేదనేది వాస్తవమని వారాణసీ కమిషనర్‌ దీపక్‌ అగర్వాల్‌ నిర్ధారించారు.


ఈవీఎంలను బుధవారం తరలించాల్సి ఉండగా.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా మంగళవారం రాత్రే నళినీకాంత్‌ తరలించారని వారాణసీ జిల్లా మెజిస్ట్రేట్‌ కౌశల్‌రాజ్‌ శర్మ చెప్పారు. ఆమె స్థానంలో కొత్త నోడల్‌ ఆఫీసర్‌ (ఈవీఎంలు)గా మరో ఏడీఎం (ఫైనాన్స్‌, రెవెన్యూ) సంజయ్‌ కుమార్‌ను నియమించారు. ఇక యూపీలోని బరేలీలో అదనపు ఎన్నికల అధికారి (ఏఈవో) వి.కె.సింగ్‌ను ఎన్నికల విధుల నుంచి ఎన్నికల కమిషన్‌ తప్పించింది. బరేలీ మునిసిపాలిటీ పరిధిలోని బహేరీ ప్రాంతంలో ఉన్న ఓ చెత్తకుండీలో బ్యాలెట్‌ పెట్టెలతో పాటు ఇతరత్రా ఎన్నికల సామగ్రి  బయటపడటంతో వి.కె.సింగ్‌ను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా ఘోరవాల్‌ పట్టణ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ రమేశ్‌కుమార్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. ఆయన వాహనంలోని ఓ పెట్టెలో బ్యాలెట్‌ పేపర్లు లభ్యమవడంతో ఎన్నికల కమిషన్‌ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈనేపథ్యంలో వారాణసీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించేందుకు బిహార్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)ని ప్రత్యేక అధికారిగా నియమించినట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. మీరట్‌లో ఓట్ల లెక్కింపును పర్యవేక్షించే ప్రత్యేక అధికారిగా ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారిని నియమించినట్లు వెల్లడించింది. 




యూపీలో బీజేపీకే ఘన విజయం!

మరో ఎగ్జిట్‌ పోల్‌లో వెల్లడి 


న్యూఢిల్లీ, మార్చి 9: ఎన్నికల ఫలితాల ముంగిట మరో సంస్థ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ప్రకటించింది. లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్‌ సంస్థలు జరిపిన సర్వేలో యూపీలో బీజేపీ 43శాతం ఓట్లతో ఘన విజయం సాధించనున్నట్లు తేలింది. 2017లో ఇదే శాతం ఓట్లతో బీజేపీకి 300 సీట్లు వచ్చాయి. ఎస్పీకి 35 శాతం, బీఎస్పీకి 15 శాతం, కాంగ్రె్‌సకు 3 శాతం ఓట్లు రానున్నాయి. పంజాబ్‌లో 40ు ఓట్లతో ఆప్‌ ఘన విజయం సాధించనుండగా, కాంగ్రె్‌సకు 26ు, ఆకాలీదళ్‌కు 20ు ఓట్లు రానున్నాయి. గోవాలో బీజేపీకి 32ు, కాంగ్రె్‌సకు 29ు, తృణమూల్‌ కాంగ్రె్‌సకు 14ు, ఆప్‌నకు 7ు ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లోనూ భాజపాకే కాస్త మొగ్గు కనిపిస్తోంది.




ఫలితాలకు ముందే బేరసారాలు షురూ

బీజేపీ నుంచి ఎమ్మెల్యేల రక్షణకు కాంగ్రెస్‌ యత్నాలు


న్యూఢిల్లీ, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ఐదు రాష్ట్రాల ఫలితాలకు ముందే బేరసారాలకు షురూ అయిపోయాయి. ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ నేతల ప్రలోభాల నుంచి కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది. ఉత్తరాఖండ్‌లోని 70 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించాయి. బీజేపీ తరఫున బేరసారాలు నడిపేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత కైలాష్‌ విజయ వర్గీయ డెహ్రాడూన్‌ వచ్చారు.


ఉత్తరాఖండ్‌కు చెందిన తమ ఎమ్మెల్యేలను ఛత్తీ్‌సగఢ్‌లోని రాయపూర్‌లో రిసార్ట్‌కు తరలించాలని, గోవా ఎమ్మెల్యేలను మరో రాష్ట్రానికి తరలించాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. ఉత్తరాఖండ్‌ ఎమ్మెల్యేల బాధ్యతను ఛత్తీ్‌సగఢ్‌ సీఎం భూపేష్‌కు అప్పగించారు. గోవా ఎమ్మెల్యేల బాధ్యతను కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌కు అప్పగించారు. ఇక మణిపూర్‌లో టీఎస్‌ సింగ్‌దేవ్‌ పర్యవేక్షిస్తున్నారు. గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటులో ఆప్‌, టీఎంసీ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి.


Updated Date - 2022-03-10T06:43:56+05:30 IST