ఛత్తీస్‌గఢ్‌లో రిజర్వేషన్ల పెంపు కొట్టివేత

ABN , First Publish Date - 2022-09-21T07:22:19+05:30 IST

ఛత్తీ్‌సగఢ్‌లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతూ పదేళ్ల క్రితం అప్పటి బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.

ఛత్తీస్‌గఢ్‌లో రిజర్వేషన్ల పెంపు కొట్టివేత

58% రాజ్యాంగ విరుద్ధం.. 50 శాతానికి మించొద్దని హైకోర్టు సూచన


బిలా్‌సపూర్‌, సెప్టెంబరు 20: ఛత్తీ్‌సగఢ్‌లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతూ పదేళ్ల క్రితం అప్పటి బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయం కారణంగా మొత్తం రిజర్వేషన్లు 58 శాతానికి పెరిగాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరుప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ పి.పి.సాహూల ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ఆ ఉత్తర్వుల కారణంగా పొందిన ప్రవేశాలు, ఉద్యోగాల్లో జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. విద్యా సంస్థల ప్రవేశాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచుతూ 2012లో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్సీల రిజర్వేషన్లు 8 శాతం నుంచి 12 శాతానికి పెంచింది. ఎస్టీల కోటాను ఏకంగా 12 శాతం మేర పెంచడంతో ఆ వర్గంలో రిజర్వేషన్లు 32 శాతానికి పెరిగాయి. ఓబీసీల రిజర్వేషన్లు 14 శాతం మేర ఉండగా, దాంట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దాంతో మొత్తం రిజర్వేషన్లు 58 శాతానికి పెరిగాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న పరిమితి ఉండగా, దాన్ని 58 శాతానికి పెంచడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. జులైలో వాదనలు పూర్తికాగా తాజాగా తీర్పును వెలువరించింది. 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లను పెంచడం సమాన అవకాశాలను ప్రసాదించే రాజ్యాంగంలోని 16(1) అధికరణానికి విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యంపై ఎలాంటి అధ్యయనం కూడా చేయలేదని పేర్కొంది. పరిమితికి మించి పెంచడానికి దారితీసిన అసాధారణ కారణాలు ఏమిటో వివరించలేకపోయిందంటూ వ్యాఖ్యానించిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాదుల్లో ఒకరైన విజయ్‌ కుమార్‌ పాండే చెప్పారు. 

Updated Date - 2022-09-21T07:22:19+05:30 IST