PoK : పాక్ ఆక్రమిత కశ్మీర్ మన సొంతం కాబోతోంది! రాజ్నాథ్ సింగ్ సంకేతాలు!
ABN , First Publish Date - 2022-10-27T14:39:21+05:30 IST
పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీరును భారత్ స్వాధీనం చేసుకోబోతోందా? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)
శ్రీనగర్ : పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీరును భారత్ స్వాధీనం చేసుకోబోతోందా? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) జమ్మూ-కశ్మీరు గడ్డపై నుంచి చెప్పిన మాటల ఆంతర్యం ఏమిటి? గిల్గిట్-బాల్టిస్థాన్ను చేరుకుంటేనే జంట కేంద్ర పాలిత ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యం పూర్తవుతుందనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
రాజ్నాథ్ సింగ్ గురువారం శ్రీనగర్లో ‘శౌర్య దినోత్సవాల’లో పాల్గొన్నారు. 1947 అక్టోబరు 27న భారత వాయు సేన (Indian Air Force) శ్రీనగర్లో దిగి, పాకిస్థాన్ ముష్కరులతో పోరాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాజ్నాథ్ మాట్లాడుతూ, జమ్మూ-కశ్మీరు, లడఖ్లలో అభివృద్ధి ప్రస్థానాన్ని ఇప్పుడే మొదలుపెట్టామన్నారు. గిల్గిట్-బాల్టిస్థాన్ను చేరుకుంటే మన లక్ష్యం నెరవేరుతుందన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీరు ప్రజలపై పాకిస్థాన్ (Pakistan) దురాగతాల గురించి ప్రస్తావిస్తూ, పొరుగు దేశం దాని పర్యవసానాలను అనుభవించవలసి వస్తుందన్నారు. ఉగ్రవాదానికి మతం లేదన్నారు. ఉగ్రవాదుల ఏకైక లక్ష్యం భారత దేశాన్ని టార్గెట్ చేయడమేనని చెప్పారు.
జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన అధికరణ 370ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వంలో దీనిని రద్దు చేయడం వల్ల జమ్మూ-కశ్మీరు ప్రజలపై వివక్ష అంతమైందని చెప్పారు.