ఎమ్మెల్యే రాజాసింగ్కు ఈసీ నోటీసులు
ABN , First Publish Date - 2022-02-17T07:39:34+05:30 IST
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది....,
బీజేపీలో రాజాసింగ్ మరొక కమేడియన్: కేటీఆర్
న్యూఢిల్లీ/హైదరాబాద్/మంగళ్హాట్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. యూపీలో బీజేపీకి ఓట్లు వేయకపోతే ప్రజలను బుల్డోజర్లతో తొక్కిస్తామని రాజాసింగ్ మాట్లాడిన వీడియో ప్రసారం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు బెదిరించే విధంగా ఉన్నాయన్న ఈసీ.. ఎన్నికల కోడ్ను, చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను చట్టప్రకారం ఎందుకు చర్యలు చేపట్టరాదో 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో తెలిపింది. నిర్ణీత గడువులోగా సమాధానం ఇవ్వకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవని పేర్కొంది. కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరొక కమేడియన్ అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీలో ఎవరైనా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తారా? అని ఆలోచించినప్పుడు ఇలాంటి కమేడియన్లు మన ముందుకు వస్తారని ట్వీట్ చేశారు. రాజాసింగ్వి మతిలేని వ్యాఖ్యలని కాంగ్రెస్ పిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు.