రాజ్థాకరే తర్వాత సీన్లోకి ఒవైసీ: ఎన్సీపీ జోస్యం
ABN , First Publish Date - 2022-04-16T22:18:51+05:30 IST
మహారాష్ట్రలో మసీదులపై ఉన్న లౌడ్స్పీకర్లను తొలగించాలనే డిమాండ్తో రాజ్థాకరే..
పుణె: మహారాష్ట్రలో మసీదులపై ఉన్న లౌడ్స్పీకర్లను తొలగించాలనే డిమాండ్తో రాజ్థాకరే సారథ్యంలోని ఎంఎన్ఎస్ రేపిన వివాదం అంతకంతకూ ముదురుతోంది. దీంతో మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని కూడా ఈ వ్యవహారంపై త్వరలోనే దృష్టి సారించే అవకాశాలున్నాయని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ శనివారంనాడు అన్నారు. ఇందువల్ల రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
శనివారంనాడు జరిగిన ఎన్సీపీ 'పరివార్ సంవాద్ యాత్ర'లో మంత్రి మాట్లాడుతూ, హనుమాన్ జయంతి సందర్భంగా తమ పార్టీ హారతి, ప్రార్థనలు నిర్వహిస్తోందని చెప్పారు. అదే విధంగా రంజాన్ మాసంలో ఇఫ్తార్ కూడా ఉంటుందని, సర్వ ధర్మ సమ భావనను ఎన్సీపీ బలంగా నమ్ముతుందుని చెప్పారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేపై విమర్శలు గుప్పిస్తూ, ఇంధనం ధరలు, సిమెంట్, స్టీల్ వంటి ధరలు చుక్కలనుంటుతుండటంతో ఆ సమస్యలను గాలికొదిలేసి హనుమాన్ చాలీసా పారాయణపై కొన్ని పార్టీలు చర్చలు జరుపుతున్నాయన్నారు.
''దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు రాజ్థార్, కొద్దిరోజుల తర్వాత ఒవైసీ సీన్లోకి వస్తారు. అది మతపరమైన ఉగ్రిత్తలకు కారణమవుతుంది'' అని పాటల్ అన్నారు. రాష్ట్రంలోని మసీదులపై లౌడ్ స్పీకర్లు తొలగించకుంటే అక్కడే హనుమాన్ చాలీసా పఠనలు హోరెత్తిస్తామంటూ రాజ్థాకరే ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.