Rahul Gandhi UK visit: విదేశాంగ శాఖ అనుమతి తీసుకోలేదా?
ABN , First Publish Date - 2022-05-26T01:22:15+05:30 IST
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూకే పర్యటనకు ముందు విదేశాంగ శాఖ అనుమతి తీసుకోలేదా? అవుననే...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) యూకే (UK) పర్యటనకు ముందు విదేశాంగ శాఖ అనుమతి తీసుకోలేదా? అవుననే చెబుతున్నాయి ఢిల్లీ వర్గాలు. నిబంధనల ప్రకారం, ఎంపీలు విదేశాల్లో పర్యటించే ముందు విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి తీసుకున్న సమాచారాన్ని పర్యటనకు మూడు వారాల ముందు వెబ్సైట్లో ఉంచాలి. సహజంగా విదేశాంగ శాఖ ద్వారా పలు విదేశీ ప్రభుత్వాలు, సంస్థల నుంచి ఎంపీలకు ఆహ్వానాలు వస్తుంటాయని, నేరుగా ఆహ్వానాలు వచ్చినప్పుడు మాత్రం ఎంపీలు తప్పనిసరిగా విదేశాంగ శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. సదరు ఈవెంట్లలో పాల్గొనాలంటే రాజకీయ అనుమతి తప్పనిసరని వారు చెప్పారు.
కాగా, రాహుల్ గాంధీ ''ఐడియా ఫర్ ఇండియా'' కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళ్లారు. కేంబ్రిడ్జిలోని ''ఐడియాస్ ఫర్ ఇండియా'' కాన్ఫరెన్స్లో పాల్గొనడంతో పాటు అక్కడి భారత సంతతి ప్రజలతో ముఖాముఖీలో పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారితో ఇటీవల అంతర్జాతీయ ప్రయాణాలు నిలిచిపోయి...తిరిగి సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత రాహుల్ గాంధీ విదేశీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇదే ప్రథమం.