Chandigarh University incident: దోషులను వదిలిపెట్టేది లేదు : పంజాబ్ సీఎం
ABN , First Publish Date - 2022-09-18T20:20:18+05:30 IST
విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలను ఆన్లైన్లో షేర్ చేశారంటూ శనివారం
చండీగఢ్ : విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలను ఆన్లైన్లో షేర్ చేశారంటూ శనివారం రాత్రి నుంచి చండీగఢ్ విశ్వవిద్యాలయం (Chandigarh University) వద్ద నిరసనలు పెల్లుబకిన నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) ఆదివారం స్పందించారు. మన బిడ్డలు మనకు గర్వకారణమని, ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు.
మాన్ ఆదివారం ఇచ్చిన ట్వీట్లో, చండీగఢ్ విశ్వవిద్యాలయం వద్ద జరిగిన సంఘటన గురించి తెలుసుకుని చాలా విచారిస్తున్నట్లు తెలిపారు. అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. దోషులను నిర్థరించి, వారు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సంబంధిత అధికారులతో తాను నిరంతరం మాట్లాడుతున్నానని చెప్పారు. వదంతులను నమ్మవద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు.
చండీగఢ్ విశ్వవిద్యాలయం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, వదంతులను నమ్మవద్దని కోరింది. హాస్టల్లో స్నానం చేస్తున్న విద్యార్థినుల వీడియోలు ఆన్లైన్లో అప్లోడ్ అయ్యాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వదంతులు నిరాధారమైనవని స్పష్టం చేసింది. ఏడుగురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నట్లు పుకార్లు ప్రచారమవుతున్నాయని, వాస్తవానికి అటువంటి ప్రయత్నం ఎవరూ చేయలేదని తెలిపింది. ఈ సంఘటనలో ఎవరినీ ఆసుపత్రికి తరలించలేదని పేర్కొంది.
కొందరు విద్యార్థినులకు సంబంధించిన 60 అభ్యంతరకర వీడియోలు సర్క్యులేట్ అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదని తెలిపింది. ఈ వదంతి పూర్తిగా నిరాధారమైనదని, తప్పుడు ప్రచారమని వివరించింది. తమ ప్రాథమిక దర్యాప్తులో విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలేవీ బయటపడలేదని పేర్కొంది. అయితే ఓ విద్యార్థిని వ్యక్తిగతంగా ఓ వీడియోను చిత్రీకరించుకుని, తన బాయ్ఫ్రెండ్కు తనంతట తానే పంపించినట్లు వెల్లడైందని తెలిపింది. ఇతర విద్యార్థినుల అభ్యంతరకర వీడియోల గురించి తప్పుడు, నిరాధార వదంతులు ప్రచారమవుతున్నాయని తెలిపింది. విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్ డాక్టర్ ఆర్ఎస్ బవ ఈ ప్రకటనను జారీ చేశారు. వీడియోను పంపించిన విద్యార్థినిని, ఆమె బాయ్ఫ్రెండ్ను అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.