Mamata Banerjee సూచించిన రెండు పేర్లు ఇవేనట...
ABN , First Publish Date - 2022-06-16T00:47:53+05:30 IST
ష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిని ఏకాభిప్రాయంతో నిలబెట్టాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో బుధవారం జరిగిన..
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిని ఏకాభిప్రాయంతో నిలబెట్టాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో బుధవారం జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అభ్యర్థిత్వం విషయంలో అన్నిపార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ పవార్ ఆసక్తి చూపించకపోవడంతో ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah), గోపాల్ కృష్ణ గాంధీ (Gopala Krishna Gandhi) పేర్లను మమత సూచించినట్టు తెలుస్తోంది. ఫరూక్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటు 2009 -2014 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడుగా ఉన్నారు. గోపాల్ కృష్ణ గాంధీ పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్గా పనిచేయడంతో పాటు మహాత్మాగాంధీ, సి.రాజగోపాలాచారి మనుమడు.
కాగా, మమతాబెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, జేడీ(ఎస్), జేఎంఎం, శివసేన, వామపక్షాలతో సహా 17 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆప్, టీఆర్ఎస్, శిరోమణి అకాలీదళ్, ఒడిశా అధికార పార్టీ బీజేడీ గైర్హాజరయ్యాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్సీపీ నుంచి శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్జే, జైరాం రమేష్, రణ్దీప్ సూర్జేవాలా, జేడీఎస్ నుంచి హెచ్డీ దేవెగౌడ, హెచ్డీ కుమారస్వామి, ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్, పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ, ఎన్సీ నుంచి ఒమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.