వాష్రూమ్లో సమోసాల తయారీ
ABN , First Publish Date - 2022-04-27T07:35:48+05:30 IST
సమోసా.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే ఓ వంటకం.
8 30 ఏళ్లుగా ఓ సౌదీ రెస్టారెంట్ నిర్వాకం
జెడ్డా, ఏప్రిల్ 26: సమోసా.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే ఓ వంటకం. భారత్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల ప్రజలు వీటిని ఆవురావుమని ఆరగిస్తుంటారు. అలాంటి సమోసాల విషయంలో సౌదీ అరేబియాలోని ఓ రెస్టారెంట్ చాలా చెత్తపని చేసింది. జెడ్డా నగరంలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులు తమ భవనంలోని వాష్రూమ్(బాత్రూమ్)లో సమోసాలను వండించి వాటిని విక్రయిస్తున్నారు. సమోసాలతో పాటు అనేక రకాల ఇతర తినుబండారాలను ఇలానే వాష్రూమ్ల్లో తయారు చేయించేవారు. ఆయా వంటకాల తయారీకి పాడైపోయిన, కుళ్లిపోయిన పదార్ధాలను కూడా వాడుతున్నారు.
ఏకంగా 30 ఏళ్లుగా ఈ నిర్వాకం వెలగబెడుతుండటం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న జెడ్డా మున్సిపాలిటీ అధికారులు ఆ రెస్టారెంట్పై దాడులు నిర్వహించడంతో విషయం బయటికొచ్చింది. అపరిశుభ్రంగా ఉన్న వాష్రూమ్లో రెస్టారెంట్ సిబ్బంది వంట చేస్తుండటాన్ని చూసి నివ్వెరపోయిన అధికారులు, వెంటనే రెస్టారెంట్ను మూసివేశారు. అయితే.. ఎన్నో ఏళ్లుగా అక్కడే తిండి తింటున్న వినియోగదారులు ఈ విషయం తెలుసుకుని షాక్కు గురవుతున్నారు.