కోల్కతాలో Polio Virus New Variant గుర్తింపు
ABN , First Publish Date - 2022-06-15T22:59:04+05:30 IST
భారత దేశం పోలియో రహిత దేశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ

కోల్కతా : భారత దేశం పోలియో రహిత దేశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014లో ప్రకటించింది. కానీ తాజాగా కోల్కతాలో పోలియో వైరస్ నూతన రూపాంతరాన్ని గుర్తించారు. పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, యునిసెఫ్ (UNICEF)తో కలిసి నిర్వహించిన అధ్యయనంలో పోలియో వైరస్ రూపాంతరం బయటపడింది.
పశ్చిమ బెంగాల్లోని హౌరాలో 2011లో పన్నెండేళ్ళ బాలికకు పోలియో వైరస్ సోకినట్లు గుర్తించారు. ఆ తర్వాత UNICEFతో కలిసి రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన అధ్యయనాల్లో తాజాగా ఈ వైరస్ రూపాంతరం కనిపించింది. దీంతో రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులను అప్రమత్తం చేశారు.
కోల్కతాలోని అనేక మురికివాడల్లో ఇటువంటి అధ్యయనాలు జరుగుతూ ఉంటాయి. మెటియాబురుజ్ ప్రాంతంలోని మురికివాడలో ఈ వైరస్ రూపాంతరం కనిపించడంతో, బహిరంగ మల, మూత్ర విసర్జన చేయరాదని ఈ ప్రాంతవాసులను ఆదేశించారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న బాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్ని ప్రభుత్వాసుపత్రులు, వైద్య కళాశాలలకు ఆదేశాలు ఇచ్చారు. టీకాకరణపై కూడా దృష్టి సారించాలని ఆదేశించారు.