లౌడ్‌స్పీకర్లలో హనుమాన్ చాలీసా వినిపించిన నలుగురి అరెస్ట్

ABN , First Publish Date - 2022-04-10T20:09:22+05:30 IST

శివసేన ప్రధాన కార్యాలయం వద్ద లౌడ్‌స్పీకర్లలో హనుమాన్ చాలీసాను

లౌడ్‌స్పీకర్లలో హనుమాన్ చాలీసా వినిపించిన నలుగురి అరెస్ట్

ముంబై : శివసేన ప్రధాన కార్యాలయం వద్ద లౌడ్‌స్పీకర్లలో హనుమాన్ చాలీసాను వినిపించిన నలుగురు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలను ముంబై పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. లౌడ్‌స్పీకర్‌ను, క్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుసుకున్న ఎంఎన్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ గుడిలో హనుమాన్ చాలీసా పఠించారు. 


మసీదులపై లౌడ్‌స్పీకర్ల నుంచి పెద్ద శబ్దం వస్తుండటంతో రోగులు, బాలలు, ప్రజలు ఇబ్బందిపడుతున్నారని, ఈ పరిస్థితిని నివారించాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే ఏప్రిల్ 2న డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే తాము మసీదుల వద్ద హనుమాన్ చాలీసాను పెద్ద శబ్దంతో వినిపిస్తామని హెచ్చరించారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌పై కూడా రాజ్ థాకరే మండిపడ్డారు. శరద్ పవార్ కులం కార్డును ఎప్పటికప్పుడు వాడుకుంటూ, సమాజాన్ని విభజిస్తున్నారని దుయ్యబట్టారు. 


పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, శివసేన ప్రధాన కార్యాలయం వద్ద ఎంఎన్ఎస్ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను వినిపిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే అక్కడికి ఓ పోలీసు బృందం వెళ్లింది. ఎంఎన్ఎస్ నేత యశ్వంత్ కిల్లేదార్‌ను, మరో ముగ్గురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుంది. లౌడ్‌స్పీకర్, క్యాబ్, మరికొన్ని పరికరాలను స్వాధీనం చేసుకుంది. 


నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుసుకున్న ఎంఎన్ఎస్ కార్యకర్తలు కొందరు పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని ఓ గుడిలో హనుమాన్ చాలీసాతోపాటు ఇతర శ్లోకాలను పఠించారు. 


Updated Date - 2022-04-10T20:09:22+05:30 IST