యూరోప్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది : మోదీ
ABN , First Publish Date - 2022-05-01T20:42:25+05:30 IST
యూరోపు దేశాలు అనేక సవాళ్లతో సతమతమవుతున్న సమయంలో

న్యూఢిల్లీ : యూరోపు దేశాలు అనేక సవాళ్లతో సతమతమవుతున్న సమయంలో తాను డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మే 2న ఆయన ఈ పర్యటనకు బయల్దేరుతారు. ఈ ఏడాది ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో యూరోపులో రాజకీయ పరిస్థితులు మారుతున్న సంగతి తెలిసిందే.
మోదీ విడుదల చేసిన ప్రకటనలో, ఐరోపాకు ప్రస్తుతం అనేక సవాళ్ళు, చాయిస్లు ఉన్నాయని, అటువంటి సమయంలో తాను ఆ ప్రాంతంలో పర్యటించబోతున్నానని తెలిపారు. శాంతి, సౌభాగ్యాల కోసం భారత దేశం అన్వేషిస్తోందని, దీనిలో యూరోపియన్ భాగస్వాములు చాలా ముఖ్యమైన సహచరులని తెలిపారు. అటువంటి యూరోప్ దేశాలతో సహకార స్ఫూర్తిని బలోపేతం చేసుకోవడానికి తాను డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటిస్తున్నానని తెలిపారు.
మోదీ పర్యటనలో ముందుగా మే 2న జర్మనీ వెళ్తారు. German Chancellor Olaf Scholzతో బెర్లిన్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు కలిసి ఇండియా-జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ)కి సహాధ్యక్షత వహిస్తారు. జర్మనీలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోనే ఈ ఐజీసీ జరుగుతుండటం పట్ల మోదీ హర్షం ప్రకటించారు. మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రాధాన్యాలను గుర్తించేందుకు ఇది దోహదపడుతుందన్నారు. India, Germany మంత్రులు కూడా చర్చలు జరుపుతారు.
మే 3న Denmarkలోని కోపెన్హాగన్లో మోదీ పర్యటిస్తారు. ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇండియా-నోర్డిక్ రెండో సదస్సులో ఆయన పాల్గొంటారు. ఐస్లాండ్ ప్రధాన మంత్రి కట్రిన్ జాకబ్స్డొట్టిర్, నార్వే పీఎం జోనాస్ గహ్ర్ స్టోర్, స్వీడర్ పీఎం మగ్ధలీనా ఆండర్సన్, ఫిన్లాండ్ ప్రధాని సన్న మారిన్లతో కూడా చర్చలు జరుపుతారు. ఈ దేశాలనే నోర్డిక్ దేశాలు అంటారు. ఇండియా-డెన్మార్క్ బిజినెస్ రౌండ్ టేబుల్లో పాల్గొంటారు. డెన్మార్క్లోని భారత సంతతి ప్రజలను కూడా కలుస్తారు.
మే 4న స్వదేశానికి తిరిగి రావడానికి ముందు మోదీ ఫ్రాన్స్లో కాసేపు పర్యటిస్తారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మేక్రన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఫ్రాన్స్లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో మేక్రన్ విజయం సాధించారు. ఈ ఫలితాలు వెలువడిన పది రోజుల్లోనే తాను ఫ్రాన్స్లో పర్యటించబోతున్నానని, మేక్రన్ను వ్యక్తిగతంగా అభినందించే అవకాశం లభించిందని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత మైత్రి బలపడటానికి తన పర్యటన దోహదపడుతుందన్నారు.