అవినీతి చెదల వల్ల దేశం గుల్ల : మోదీ

ABN , First Publish Date - 2022-01-30T18:43:41+05:30 IST

అవినీతి అంటే ఓ చెద వంటిదని, అది దేశాన్ని గుల్ల చేస్తుందని

అవినీతి చెదల వల్ల దేశం గుల్ల : మోదీ

న్యూఢిల్లీ : అవినీతి అంటే ఓ చెద వంటిదని, అది దేశాన్ని గుల్ల చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఈ చెదను సాధ్యమైనంత త్వరగా దేశం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2022లో తొలి ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు. 


కోటి మందికి పైగా బాలలు తమ మనసులో మాటను పోస్టు కార్డుల ద్వారా తనకు తెలియజేశారని చెప్పారు. ఈ పోస్టు కార్డులు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చాయని, అదేవిధంగా విదేశాల నుంచి కూడా కొన్ని వచ్చాయని తెలిపారు. మన దేశ భవిష్యత్తు పట్ల నూతన తరం దృక్పథం విస్తృతంగా, సమగ్రంగా ఈ పోస్ట్ కార్డుల ద్వారా తెలిసిందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక రాసిన పోస్ట్ కార్డ్‌లోని విషయాన్ని ప్రస్తావిస్తూ, 2047నాటికి అవినీతి రహిత భారత దేశాన్ని చూడాలని తాను కలలు కంటున్నానని ఆ బాలిక రాసినట్లు తెలిపారు. 


అవినీతి రహిత భారత దేశం గురించి మాట్లాడుతున్నారని, అవినీతి అంటే చెద వంటిదని, దీనివల్ల దేశం గుల్ల అవుతుందని అన్నారు. ఈ చెద నుంచి బయటపడటానికి  2047 వరకు ఎందుకు ఆగాలని ప్రశ్నించారు. దేశ ప్రజలు, యువత అందరూ కలిసికట్టుగా చేయవలసిన పని ఇది అని చెప్పారు. ఈ కృషిని సాధ్యమైనంత త్వరగా చేపట్టాలన్నారు. మన విధులు, కర్తవ్యాలను నిర్వహించేందుకు మనం ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యమని తెలిపారు. కర్తవ్య భావన ఉన్నపుడు, కర్తవ్యమే అత్యున్నతమైనది అయినపుడు అవినీతి ఉండదని చెప్పారు. 


న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర జవాన్ జ్యోతిని సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేసినట్లు మోదీ తెలిపారు. ఈ భావోద్వేగ, ఉత్తేజ సమయంలో  అమర వీరుల కుటుంబ సభ్యులు, ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారని తెలిపారు. ఈ యుద్ధ స్మారకాన్ని ప్రజలు సందర్శించాలని కోరారు. 


Updated Date - 2022-01-30T18:43:41+05:30 IST