సంత్ రవి దాస్ భజనలో పాల్గొన్న మోదీ
ABN , First Publish Date - 2022-02-16T18:07:05+05:30 IST
సంత్ రవి దాస్ జయంత్యుత్సవాల సందర్భంగా ప్రధాన

న్యూఢిల్లీ : సంత్ రవి దాస్ జయంత్యుత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్లో ప్రార్థనలు చేశారు. ఢిల్లీలోని కరోల్బాగ్లో ఉన్న ఈ మందిరంలో భక్తులతోపాటు షబద్ కీర్తన్లో పాల్గొన్నారు.
వారణాసిలోని సంత్ రవిదాస్ జన్మస్థలంలో ఉన్న మందిరం సుందరీకరణ, విస్తరణ పనుల గురించి మీడియా కథనాలను మోదీ ఓ ట్వీట్లో జత చేశారు. కాశీ (వారణాసి) నుంచి తాను లోక్సభ సభ్యునిగా గెలిచినప్పటి నుంచి తన ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ గురు రవిదాస్ స్ఫూర్తిని ఏ విధంగా ఆచరిస్తున్నదీ వివరించారు. అదేవిధంగా తాను ఢిల్లీలోని శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరంలో షబద్ కీర్తన్లో భక్తులతో కలిసి పాల్గొన్నట్లు ఓ వీడియోను జత చేశారు. ఈ క్షణాలు చాలా ప్రత్యేకమైనవని పేర్కొన్నారు.
గురు రవిదాస్ 15వ శతాబ్దానికి చెందినవారు. ఆయన అనుచరులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ముఖ్యంగా దళితులు ఆయన బోధనలను అనుసరిస్తారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్లలో ఆయన భక్తులు చాలా మంది ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ శాసన సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల నేపథ్యంలోనే పంజాబ్ శాసన సభ ఎన్నికలను ఈ నెల 14 నుంచి ఈ నెల 20కి వాయిదా వేశారు.
మోదీ మంగళవారం మాట్లాడుతూ, సంత్ రవిదాస్ దురాచారాలను తొలగించడానికి, కులతత్వాన్ని, అంటరానితనాన్ని నిర్మూలించడానికి కృషి చేశారన్నారు.