నిమిషంలో 109 పుష్ అప్స్ చేసిన యువకునికి మోదీ ప్రశంసలు
ABN , First Publish Date - 2022-01-30T18:13:20+05:30 IST
నిమిషంలో 109 పుష్ అప్స్ చేసిన మణిపూర్ యువకుడిని
న్యూఢిల్లీ : ఓ నిమిషంలో 109 పుష్ అప్స్ చేసిన మణిపూర్ యువకుడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. మన దేశంలో విద్య కేవలం పాఠ్య పుస్తకాలకు, తరగతి గదులకు మాత్రమే పరిమితమైనట్లు మనం చూడలేదన్నారు. మన గత చరిత్రను పరిశీలించినపుడు విద్యా రంగంతో అనుబంధంగలవారు అనేక మంది ఉన్నారని చెప్పారు. అన్ని రంగాలకు చెందిన అనేక మంది చాలా విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని, విద్య వల్ల కలిగే ఆనందాన్ని ఇతరులు కూడా పొందాలనే ఆకాంక్షతో చాలా మంది వనరులను సమకూర్చారని చెప్పారు. ప్రతి నెలా నిర్వహించే ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు.
మణిపూర్నకు చెందిన థౌనవోజమ్ నిరంజోయ్ సింగ్ (24) జనవరి 23న పుష్ అప్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. తన చేతి మునివేళ్ళు, కాలి మునివేళ్ళు ఆధారంగా పుష్ అప్స్ చేశాడు. ఒక నిమిషంలో 109 పుష్ అప్స్ చేసి సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. గతంలో సింగ్ రెండుసార్లు గిన్నిస్ రికార్డు సృష్టించాడు. నిమిషానికి 105 పుష్ అప్స్తో తానే నెలకొల్పిన గిన్నిస్ రికార్డును తానే తుడిచేశాడు. ఈ కార్యక్రమాన్ని ఇంఫాల్లో ఆజ్టెక్స్ స్పోర్ట్స్ సంస్థ నిర్వహించింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆ యువకుడిని ప్రశంసించారు. మణిపురి యువకుని శక్తి, సామర్థ్యాలు నమ్మశక్యంగా లేవని, ఇటువంటి సాహస కృత్యాన్ని చూడటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆయన సాధించిన విజయం గర్వకారణమని తెలిపారు.