మహారాష్ట్ర నుంచి పీయూష్.. కర్ణాటక నుంచి నిర్మల
ABN , First Publish Date - 2022-05-30T09:02:15+05:30 IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కర్ణాటక నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మళ్లీ అవకా శం కల్పించాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది.

రాజ్యసభ ఎన్నికలకు 16 మందితో బీజేపీ జాబితా
తమిళనాడు నుంచి చిద్దూ.. కర్ణాటక నుంచి జైరామ్
57 రాజ్యసభ సీట్లకు జూన్ 10న ఎన్నికలు
న్యూఢిల్లీ, మే 29(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కర్ణాటక నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మళ్లీ అవకా శం కల్పించాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. మరో మంత్రి పీయూష్ గోయల్కు మళ్లీ మహారాష్ట్ర నుంచి అవకాశం ఇచ్చింది. రాజ్యసభ ఎన్నికలకు 16 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ఆదివారం ప్రకటించింది. కర్ణాటక నుంచి బీజేపీకి రెండు, కాంగ్రె్సకు ఒకటి, జేడీఎ్సకు ఒకటి దక్కే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ నుంచి కవితా పాటీదార్, కర్ణాటక నుంచి సినిమా నటుడు, బీజేపీ అధికార ప్రతినిధి జగ్గేశ్, మహారాష్ట్ర నుంచి మాజీ ఎమ్మెల్సీ అనిల్ సుఖ్ దేవ్ రావ్ బోండే, రాజస్థాన్ నుంచి మాజీ మంత్రి ఘన్ శ్యామ్ తివారీ, ఉత్తర ప్రదేశ్ నుంచి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ వాజపేయి, గోరఖ్ పూర్ మాజీ ఎమ్మెల్యే రాధా మోహన్ దాస్ అగర్వాల్, బీఎస్పీ మాజీ ఎంపీ సురేంద్ర సింగ్ నాగర్, నిషాద్ వర్గం నేత బాబూరామ్ నిషాద్, జాతీయ ఉపాధ్యక్షురాలు దర్శనా సింగ్, ఉత్తరాఖండ్ ఓబీసీ కమిషన్ చైర్ పర్సన్ కల్నా సైనీ, బీహార్ నుంచి సతీశ్ చంద్ర దుబే, శంభు శరణ్ పటేల్, హరియాణా నుంచి కిషన్ లాల్ పన్వర్కు బీజేపీ అవకాశమిచ్చింది.
జూన్ 10న ఎన్నికలు జరిగే 57 రాజ్యసభ సీట్లలో బీజేపీకి 23 సీట్లు దక్కనున్నాయి. వాటిలో 16 సీట్లకు అభ్యర్థులను ఆదివారం ప్రకటించగా మిగతా ఏడు సీట్లకు ఇంకా ప్రకటించాల్సి ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు బీజేపీ నేతలు రాజ్యసభ సీటు వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. కాగా.. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరును ఈ జాబితాలో చేర్చలేదు. మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరాన్ని తమిళనాడు నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 10 మందితో కాంగ్రెస్ జాబితాను విడుదల చేసింది. కర్ణాటక నుంచి జైరామ్ రమేశ్, రాజస్థాన్ నుంచి ముకుల్ వాస్నిక్, రణ్దీప్ సూర్జేవాలా, ప్రమోద్ తివారీ, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ తంఖా, హరియాణా నుంచి అజయ్ మాకెన్, ఛత్తీస్గఢ్ నుంచి రాజీవ్ శుక్లా, రంజీత్ రంజన్, మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ప్రతాప్గఢీ పేర్లున్నాయి.