బీజేపీకి వీడ్కోలు పలికే సమయం వచ్చింది: అఖిలేష్
ABN , First Publish Date - 2022-01-08T22:59:31+05:30 IST
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు..
లక్నో: ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు పలికే సమయం వచ్చేసిందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ప్రకటించిన అనంతరం అఖిలేష్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పెనుమార్పులను ఎన్నికల తేదీలు సంకేతమని చెప్పారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను తమ పార్టీ తు.చ. తప్పకుండా పాటిస్తుందని, అధికార పార్టీ కూడా కచ్చితంగా నిబంధనలు పాటించేలా ఎన్నికల కమిషన్ చూడాలని అన్నారు.
ఈసీఐ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుంది. రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 14న, మూడో దశ పోలింగ్ ఫిబ్రవరి 20న, నాలుగో దశ పోలింగ్ ఫిబ్రవరి 23న, ఐదో దశ పోలింగ్ ఫిబ్రవరి 27న, ఆరో దశ పోలింగ్ మార్చి 3న, ఏడో దశ పోలింగ్ మార్చి 7న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.