57 మంది దుర్మరణం పాక్‌లో ఆత్మాహుతి దాడి

ABN , First Publish Date - 2022-03-05T07:07:48+05:30 IST

పాకిస్థాన్‌లో షియా వర్గీయులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అప్ఘానిస్థాన్‌ సరిహద్దుకు అనుకొని ...

57 మంది దుర్మరణం పాక్‌లో ఆత్మాహుతి దాడి

197 మందికి తీవ్ర గాయాలు

షియా వర్గీయులే లక్ష్యంగా 

పెషావర్‌ మసీదులో ఘటన

మా పనే: ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ

8 57 మంది దుర్మరణం.. 

197 మందికి తీవ్ర గాయాలు


పెషావర్‌, మార్చి 4: పాకిస్థాన్‌లో షియా వర్గీయులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అప్ఘానిస్థాన్‌ సరిహద్దుకు అనుకొని ఉన్న కైబర్‌ పక్తుంక్వా ప్రావిన్సులోని పెషావర్‌లో శక్తిమంతమైన ఆత్మాహుతి బాంబుదాడితో విరుచుకుపడ్డారు. వాయవ్య పెషావర్‌లోని కిస్సా క్వానీ బజార్‌ ప్రాంతంలోని షియా వర్గానికి చెందిన జామియా మసీదులో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో కనీసం 57 మంది ప్రాణాలు కోల్పోయారు. 197 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.  శుక్రవారం కావడం, పెద్ద సంఖ్యలో ముస్లింలు మసీదులోకి వచ్చి సామూహిక ప్రార్థనలు చేస్తుండటం, ఆ సమయంలోనే ఈ భారీ పేలుడు సంభవించడంతో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘటనకు తామే పాల్పడినట్లుగా ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ, దాని అనుబంధ సంస్థలు ప్రకటించుకున్నాయి. గాయపడిన వారిని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రులకు తరించారు. మసీదులోకి ఇద్దరు ముష్కరులు ప్రవేశించినా వారిలో ఒకరే సూసైడ్‌ బాంబర్‌ ఉన్నాడు. తొలుత ప్రవేశద్వారం వద్ద కాపలాగా ఉన్న ఇద్దరు పోలీసులపైకి వారు కాల్పులు జరిపారు. వీరిలో ఓ పోలీసు అక్కడికక్కడే మృతిచెందగా మరో పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పులు జరుపుతుండగానే ఇద్దరిలో ఒకరు లోపలికి ప్రవేశించి.. నమాజు చేస్తున్నవారి మధ్యలోంచి ప్రార్థనా పీఠం వద్దకు దూసుకెళ్లి అక్కడ తనను తాను పేల్చేసుకున్నాడు. భారీ శబ్దంతో కూడిన పేలుడు ధాటికి నమాజు చేస్తున్న శరీరాలు ఛిద్రమయ్యాయి. క్షతగాత్రులు నెత్తురోడుతూ హాహాకారాలు చేశారు. ఈ ఆత్మాహుతి దాడి ఘటనను పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ ఆల్వీ, ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రంగా ఖండించారు.

Updated Date - 2022-03-05T07:07:48+05:30 IST