Pakistan: తన కారును ఓవర్ టేక్ చేశారని.. హిందూ కుటుంబంపై దాడిచేసిన పాక్ మంత్రి బంధువు
ABN , First Publish Date - 2022-08-09T22:09:42+05:30 IST
తన కారును ఓవర్ టేక్ చేశారన్న ఒకే ఒక్క కారణంతో పాకిస్థాన్లోని ఓ రాజకీయ నేత బంధువు రెచ్చిపోయారు. హిందూ
సింధ్: తన కారును ఓవర్ టేక్ చేశారన్న ఒకే ఒక్క కారణంతో పాకిస్థాన్లోని ఓ రాజకీయ నేత బంధువు రెచ్చిపోయారు. హిందూ కుటుంబంపై దాడి చేశారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. సింధ్ (Sindh) ప్రాంతానికి చెందిన బాధిత కుటుంబం మీర్పూర్ మథేలో పోలీస్ స్టేషన్ పరిధిలోని రాహార్కి సాహిబ్ (Raharki Sahib) ఆలయం నుంచి వస్తుండగా గోఠ్కి సమీపంలోని ఓ రెస్టారెంట్ వద్ద వారిపై దాడి జరిగింది. స్థానిక రాజకీయ నాయకుడి బంధువు షంషేర్ పితాఫి (Shamsher Pitafi) వాహనాన్ని బాధిత కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఓవర్ టేక్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన పితాఫి ఆయన స్నేహితులు వారి కారును వెంబడించి మరీ దాడి చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. హైవేపై షంషేర్ వాహనాన్ని బాధిత కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఓవర్ టేక్ చేసిన తర్వాత ఆ కారులోని పిల్లాడు ఐస్క్రీం రేపర్ను బయట విసిరేశాడు. అది షంషేర్ కారు విండ్షీల్డ్పై పడింది. తన కారును ఓవర్ టేక్ చేయడమే కాకుండా, రేపర్ తన కారు పడడంతో షంషేర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. దీంతో బాధిత కుటుంబం కారును వెంబడించిన షంషేర్ అనుచరులు దాదాపు 12 మంది ఓ రెస్టారెంట్ వద్ద హిందూ కుటుంబాన్ని గుర్తించారు. తొలుత కారును ధ్వంసం చేసిన దుండగులు ఆ తర్వాత కారులో ఉన్న అజయ్ కుమార్పైనా దాడి చేశారు.
కారులో ఉన్న ముగ్గురు మహిళలతో షంషేర్ అనుచరులు అసభ్యంగా ప్రవర్తించినట్టు పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ (PML-N)కు చెందిన ఖీయల్ దాస్ ఖోహిస్తాని ఆరోపించారు. నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రధాన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఖోస్తాని డిమాండ్ చేశారు. సింధ్ పశుగణాభివృద్ధి, ఫిషరీస్ మంత్రి అబ్దుల్ బారి పితాఫికి షంషేర్ పితాఫి కజిన్ అని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. దీంతో ఆయన అరెస్టుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.