మాదకద్రవ్యాలతో భారత్లోకి పాక్ డ్రోన్లు
ABN , First Publish Date - 2022-11-30T02:30:31+05:30 IST
పాకిస్థాన్ నుంచి సుమారు 10 కిలోల మాదకద్రవ్యాలతో భారత భూభాగంలోకి ప్రవేశించిన రెండు డ్రోన్లను సరిహద్దు భద్రతా దళాలు(బీఎ్సఎఫ్) కూల్చేశాయి.
కూల్చేసిన బీఎ్సఎఫ్ సిబ్బంది
అమృత్సర్, నవంబరు 29: పాకిస్థాన్ నుంచి సుమారు 10 కిలోల మాదకద్రవ్యాలతో భారత భూభాగంలోకి ప్రవేశించిన రెండు డ్రోన్లను సరిహద్దు భద్రతా దళాలు(బీఎ్సఎఫ్) కూల్చేశాయి. సోమవారం అర్ధరాత్రి సమయంలో పంజాబ్లోని తారన్తరన్ జిల్లా కలాశ్ హవేలియన్ గ్రామ సమీపంలో ఎగురుతున్న ఓ డ్రోన్ను భద్రతా దళాలు గుర్తించి కూల్చేశాయి. ఇది పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిందని అధికారులు తెలిపారు. దానికి చుట్టి ఉన్న పాలిథిన్ సంచుల్లో నుంచి సుమారు 6.6 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. అదే రోజు రాత్రి అమృత్సర్ జిల్లా చాహర్పూర్ గ్రామ సమీపంలో మరో డ్రోన్ను బీఎ్సఎఫ్ దళాలు గుర్తించి కూల్చేశాయి. ఇది కూడా పాక్ నుంచి వచ్చిందేనని అధికారులు తెలిపారు. దానికి కట్టి ఉన్న పాలిథిన్ కవర్ల నుంచి సుమారు 3.11 కిలోల నార్కోటిక్స్ను స్వాధీనం చేసుకున్నారు.