Owaisi's dig at PM : జీ జిన్‌పింగ్ అంటే అంత భయమా? : ఒవైసీ

ABN , First Publish Date - 2022-10-07T20:23:53+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్

Owaisi's dig at PM : జీ జిన్‌పింగ్ అంటే అంత భయమా? : ఒవైసీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) శుక్రవారం మండిపడ్డారు. చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల పరిస్థితిపై చర్చించాలని కోరుతూ ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంపై ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో ఓటు వేయకుండా భారత్ ఎందుకు గైర్హాజరైందో చెప్పాలని డిమాండ్ చేశారు. 


ఒవైసీ ఇచ్చిన ట్వీట్‌లో, వీఘర్ ముస్లింల సమస్యపై ముఖ్యమైన ఓటు వేయకుండా UNHRC నుంచి గైర్హాజరై, చైనాకు సాయపడాలని భారత్ ఎందుకు నిర్ణయం తీసుకుందో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) వివరిస్తారా? అని ప్రశ్నించారు. తాను 18 సార్లు కలిసిన జీ జిన్‌పింగ్‌ (Xi Jinping)ను ఇబ్బంది పెట్టడానికి మోదీ భయపడుతున్నారా? అని నిలదీశారు. సరైనదాని గురించి భారత్ మాట్లాడలేకపోతోందా? అని ప్రశ్నించారు. 


కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ కూడా మోదీపై విరుచుకుపడ్డారు. చైనాలోని వీఘర్లపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై చర్చ కోసం యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో ముసాయిదా తీర్మానంపై ఓటింగ్ నుంచి భారత దేశం గైర్హాజరైందని, మన భూమిని కబ్జా చేసిన చైనాను జవాబుదారీ చేయడం అటుంచి, మానవ హక్కుల ఉల్లంఘనలపై చైనాను ఖండించడానికైనా మన ప్రధాన మంత్రి మోదీ ముందుకు రాలేకపోతున్నారన్నారు. చైనా అంటే మోదీ ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. 


చైనాలోని జింజియాంగ్‌లో వీఘర్ (Uighur) ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, వీటిపై చర్చించాలని ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి తిరస్కరించింది. భారత్, మలేసియా, ఉక్రెయిన్ సహా 11 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరుకాగా, 19 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఈ తీర్మానాన్ని కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్, బ్రిటన్, అమెరికా ప్రతిపాదించాయి. టర్కీ వంటి దేశాలు బలపరిచాయి. ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, నెదర్లాండ్స్ ఈ తీర్మానానికి మద్దతిచ్చాయి.  మొత్తం మీద చైనాకు అనుకూల పరిస్థితి ఏర్పడింది. 


ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్‌గా గతంలో పని చేసిన మిషెల్లీ, బషెలెట్ ఇటీవల సమర్పించిన నివేదికలో చైనాలోని జింజియాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు విపరీతంగా జరుగుతున్నాయని తెలిపారు. 


Updated Date - 2022-10-07T20:23:53+05:30 IST