Ops మరో పదవికి గండం?
ABN , First Publish Date - 2022-07-17T15:44:37+05:30 IST
అన్నాడీఎంకే శాసనసభ సభ్యుల సమావేశం ఆదివారం సాయంత్రం అడయార్లోని ఓ స్టార్ హోటల్లో జరుగనుంది. ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు
- నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం
- తాత్కాలిక ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారి ఈపీఎస్ నేతృత్వం
- సుప్రీంకోర్టులో పన్నీర్ సెల్వం అప్పీలు
చెన్నై, జూలై 16 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే శాసనసభ సభ్యుల సమావేశం ఆదివారం సాయంత్రం అడయార్లోని ఓ స్టార్ హోటల్లో జరుగనుంది. ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) అధ్యక్షతన జరుగనున్ను ఈ సమావేశంలో ఓపీఎస్ ను అన్నాడీఎంకే శాసనసభాపక్షం ఉపనాయకుడి పదవి నుంచి తొలగించే విషయంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల 11న మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం (ఓపీఎస్) వర్గానికి చెందిన కార్యకర్తలు ఈపీఎస్ వర్గానికి చెందిన కార్యకర్తలు ఘర్షణపడటంతో రెవెన్యూ అధికారులు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి సీలు వేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా అడయార్ గ్రీన్వేస్ రోడ్డులోని ఈపీఎస్ నివాసంలో ఈ సమావేశాన్ని జరపాలని అనుకున్నారు. అయితే ప్రభు త్వం కేటాయించిన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఎలా జరుపుతారంటూ ఓపీఎస్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్టార్హోటల్ వైపు మొగ్గు చూపారు. ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు జరుగనున్న ఈ సమావేశంలో ఈ నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో శాసనసభ్యులు ఓటు వేసే విధానంపై శిక్షణ ఇవ్వనున్నారు. అదే సమయంలో ఇటీవల సర్వసభ్యమండలి తీర్మానం ద్వారా పార్టీ సమన్వయకర్త, కోశాధికారి పదవుల నుండి తొలగింపబడిన ఓపీఎస్ను అన్నాడీఎంకే శాసనసభాపక్ష ఉపనాయకుడి పదవి నుంచి తొలగించే విఫయంపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనే శాసనసభ్యులందరూ ఓపీఎస్ ను తొలగించే తీర్మానంపై సంతకం చేసినట్లయితే ఆ తీర్మానాన్ని స్పీకర్ అప్పావుకు సమర్పిస్తారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలంతా మధ్యాహ్నం మూడు గంటలకే రావాలని ఈపీఎస్ ఆదేశించారు. ప్రస్తుతం సొంత జిల్లా సేలంలో పర్యటిస్తున్న ఎడప్పాడి ఆదివారం మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్నారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఓపీఎస్...
ఈ నెల 11న ఈపీఎస్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య మండలి సమావేశానికి అనుమతిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఓపీఎస్ సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ వేశారు. పార్టీ సమన్వయకర్తగా ఉన్న తన అనుమతి లేకుండా జరిపిన ఆ సమావేశం చెల్లదని, సమావేశంలో చేసిన తీర్మానాలు పార్టీ నిబంధనలకు వ్యతిరేకమని ప్రకటించాలని ఆ పిటిషన్లో కోరారు. అంతే కాకుండా పార్టీ నియమావళి ప్రకారం సర్వసభ్యమండలి సమావేశం జరిపేందుకు 15 రోజులకు ముందు నోటీసులు జారీ చేయాల్సి ఉందని, ఈపీఎస్ వర్గీయులు ఈ నియమాన్ని పాటించలేదని ఓపీఎస్ ఆరోపించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నెల 11న జరిగిన సర్వసభ్యమండలి చెల్లదంటూ ఉత్తర్వులివ్వాలని పిటిషన్లో అభ్యర్థించగా, ఈ పిటిషన్ త్వరలో విచారణకు రానుంది. సర్వసభ్యమండలి సమావేశానికి వ్యతిరేకంగా ఇదివరకే రెండుసార్లు హైకోర్టులో, ఓసారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఓపీఎస్కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.