AAP మాత్రమే ఆ పని చేయగలదు: Kejriwal

ABN , First Publish Date - 2022-05-29T21:02:33+05:30 IST

పంజాబ్‌లో ఆప్ మంత్రి ఒకరు అవినీతికి పాల్పడ్డారు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. మీడియాలో రాలేదు. విపక్ష పార్టీలు అడగలేదు. మరే ఇతరులు ఈ విషయాన్ని గురించి బయట పెట్టలేదు, ఎవరికీ తెలియదు కూడా. అయినా అవినీతిపై సొంత పార్టీ నేతపైనే ఆప్ చర్యలు తీసుకుంది..

AAP మాత్రమే ఆ పని చేయగలదు: Kejriwal

చండీగఢ్: అవినీతి చేసిన వారిని పార్టీ నుంచి అయినా ప్రభుత్వం నుంచి అయినా తొలగించే ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీయేనని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అవినీతిని ఆప్ ఎంత మాత్రం సహించదని ఆయన అన్నారు. తమ వారని ఎవరినీ వెనుకేసుకు వచ్చే విధానం ఆప్‌కు లేదని, తప్పు ఎవరిదైనా చర్యలు ఒకే రకంగా ఉంటాయని అన్నారు. ఆదివారం హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన పార్టీ కార్యక్రమానికి కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.


‘‘పంజాబ్‌లో ఆప్ మంత్రి ఒకరు అవినీతికి పాల్పడ్డారు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. మీడియాలో రాలేదు. విపక్ష పార్టీలు అడగలేదు. మరే ఇతరులు ఈ విషయాన్ని గురించి బయట పెట్టలేదు, ఎవరికీ తెలియదు కూడా. అయినా అవినీతిపై సొంత పార్టీ నేతపైనే ఆప్ చర్యలు తీసుకుంది. సదరు మంత్రిని తొలగించి జైలుకు పంపించాం. ఒక్క ఆప్ తప్ప ఇలా ఏ పార్టీ చేయలేదు. ఇలా చేయలేరు అంటే వాళ్లు అవినీతిపరులు కాదని కాదు. మిగిలిన పార్టీలన్నీ అవినీతిలో కూరుకుపోయాయి. అందుకే తమ నేతలపై ఈ విధంగా చర్యలు తీసుకోలేవు’’ అని కేజ్రీవాల్ అన్నారు.


ఇక హర్యానా గురించి కేజ్రీ మాట్లాడుతూ ‘‘ఒక్క అవకాశం ఇవ్వండి. హర్యానా పాఠశాలలన్నింటినీ ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. మేం ఏం చేస్తామనేదానికి ఢిల్లీ పాఠశాలలే మంచి ఉదాహరణ. పేద పిల్లల్ని సైతం ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారు. అలాగే ఢిల్లీలో ఏడేళ్ల నుంచి ప్రైవేటు పాఠశాలల్ని ఫీజులు పెంచకుండా నిలువరించాం’’ అని అన్నారు.

Updated Date - 2022-05-29T21:02:33+05:30 IST